మహబూబాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని, తనను ఎదురోలేకనే పార్టీ మారుతున్నారంటూ ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంపీ అభ్య ర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొన్నట్టు ప్రకటన వెలువడిన తర్వాత తాను కూడా వైదొలుగుతున్నట్టు కొందరు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘కొట్లాడటం నా రక్తంలోనే ఉంది. కదనరంగంలో దూసుకెళ్లడమే నాకు అలవాటు. ప్రజా ఆశీర్వాదంతో, బీఆర్ఎస్ కార్యకర్తల బలంతోపాటు గులాబీ దళపతి కేసీఆర్ మార్గదర్శకంతో మానుకోటపై గులాబీ జెండా ఎగరవేస్తా’నని కవిత ధీమా వ్యక్తంచేశారు. ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె కొట్టిపారేశారు. ఎన్నికల్లో తనపై పోటీ పడేందుకు ధైర్యం లేకనే కొందరు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.