హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కేవలం హంగు, ఆర్భాటం, హడావుడి తప్ప పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలతో సాధించిందేమిటి అని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్రాన్ని నిలదీశారు. ఎంతో హడావుడి చేసి షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే సమావేశాలు ముగించారని పెదవి విరిచారు. బీఆర్ఎస్ పోరాటంతో దిగివచ్చిన కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడా రు. సీఎం కేసీఆర్ ఎప్పటినుంచో మహిళా, ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పా రు. మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టి, ఆమోదించినా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదని అన్నారు. మణిపూర్ అల్లర్లపై సభలో చర్చించకుండానే అర్ధాంతరంగా లోక్సభను వాయిదా వేశారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకే సభను వాయిదా వేశారని విమర్శించారు. మోదీకి తెలంగాణపై ఎన్నడూ ప్రేమ లేదని, గడిచిన పదేండ్లలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. మోదీ పార్లమెంట్లోనే తెలంగాణపై మూడుసార్లు విషం కకారని ధ్వజమె త్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే బీఆర్ఎస్కు క్రెడిట్ వస్తుండటాన్ని ఓర్చుకోలేక కాంగ్రెస్ నాయకులు ఓటింగ్కు దూరం ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రచారం కోసమే :ఎంపీ బడుగుల
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రచా రం కోసంమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకొన్నదని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించా రు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా బిల్లుకు మద్దతు తెలిపామని చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. 140 కోట్ల జనాభాలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారని, మహిళా బిల్లుతోపాటే ఓబీసీ బిల్లు పెట్టకుండా కేంద్రం బీసీలకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణన చేపట్టి అందులో కులగణన చేయడం ద్వారా బీసీల శాతం ఎంత ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఓబీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.