ఢిల్లీ : దేశంలో అట్టుడుకుతున్న మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడం దారుణమని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy ) ఆరోపించారు. మణిపూర్ (Manipur) అల్లర్లలో సుమారు 150 మంది చనిపోవడం, ప్రతిరోజూ అక్కడ జరుగుతున్న ఘర్షణలపై నోరుమెదపకపోవడం విచారకరమని అన్నారు.
మోదీ ప్రభుత్వం ఢిల్లీలో ఆర్డినెన్స్ బిల్లును తీసుకు వచ్చి ముఖ్యమంత్రి అధికారాలను కాలరాస్తోందని విమర్శించారు. తమకు అనుకూలురైన గవర్నర్లను (Governors) ఆయా రాష్ట్రాల్లో నియమించి వారిచేత రాష్ట్రాల హక్కులను కాలరాసేవిధంగా ప్రయత్నిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ (BRS) దేశమంత విస్తరిస్తుందని వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమ రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు .
దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తోందని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 15 ఏళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. దేశంలో ప్రజల జీవనోపాధి మెరుగు పడటం లేదని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు వస్తుందని పేర్కొన్నారు.