సిద్దిపేట : రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దుబ్బాక నుంచి గెలుస్తాననే భయంతోనే దాడి జరిగిందని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar Reddy) అన్నారు. ఆదివారం దుబ్బాక(Dubbaka)లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు.
తప్పుడు మాటలతో ప్రజలను మభ్యపెట్టి బీజేపీ అభ్యర్థి గెలిచాడు. కానీ, ప్రజలు అతడి నాటకాలను గుర్తించారన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని, అసైన్డ్ భూములు పోతాయని ప్రజలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నేను దవాఖానలో చేరితే ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అలాగే దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
దుబ్బాక మున్సిపాలిటీకి అవుటర్ రింగ్ రోడ్డు చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఇక్కడి విద్యార్థుల సౌకర్యార్థం డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. రేకుల కుంట మల్లన్న స్వామి ఆలయం, కూడవెల్లి ఆలయాన్ని పునర్నించాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి దీవించాలన్నారు.