నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని భునగిరి ఎంపీ, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో పార్టీ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని ఎంపీ కోమటి రెడ్డి ప్రకటించారు.
తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని, తాను వాటిలో పాల్గొన్నాల్సి ఉన్నదని చెప్పారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందని వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న దగ్గర సమీక్షలు పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సాధారణమేనని వెల్లడించారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.