హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకొన్నది. గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను గ్రీన్ రిబ్బన్ చాంపియన్గా గుర్తిస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్వర్ 18 గ్రూప్ అవార్డును అందజేసింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల ఎంపీ సంతోష్ హాజరు కాలేకపోయారు. దీంతో శనివారం నెట్వర్ 18 గ్రూప్ ప్రతినిధి ఎంపీ సంతోష్కుమార్ను హైదరాబాద్లో కలిసి అవార్డును అందించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్నివర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్కుమార్ ఈ అవార్డుకు ఎంపికైనట్టు నెట్వర్ 18 గ్రూప్ తెలిపింది. పర్యావరణ సమతుల్యానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు.
పులుల రక్షణలకు గ్రీన్ చాలెంజ్ అండ
దేశవ్యాప్తంగా అడవుల రక్షణ, పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్ను ప్రవేశ పెట్టింది. శనివారంతో ఈ సేవ్టైగర్ ఉద్యమానికి 50 ఏండ్లు నిండాయి. దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకున్న చర్యల వల్ల పులుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 1973లో 1,827గా నమోదైన పులుల సంఖ్య 2022 నాటికి 2,967కు చేరింది. టైగర్ రిజర్వుల సంఖ్య 9 నుంచి 53కు పెరిగింది. ప్రాజెక్ట్ టైగర్ ప్రాధాన్యం, అడవులు, పర్యావరణంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. సేవ్ టైగర్ ఉద్యమం గోల్డెన్ జూబ్లీ సందర్భంగా తెలంగాణకు చెందిన అమ్రాబాద్ టైగర్ రిజర్వు విడుదల చేసిన టైగర్ బుక్, టీషర్ట్, కాఫీ మగ్, సావనీర్లను ఎంపీ సంతోష్ శనివారం ప్రదర్శించారు. తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ ద్వారా అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నదని, పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఎంపీ సంతోష్ అన్నారు. గ్రీన్ చాలెంజ్ తరఫున దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపు, పర్యావరణ రక్షణపై అవగాహనకు కృషి చేస్తున్నామని, పులుల రక్షణకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతలో పెద్దపులి అగ్రభాగాన ఉంటుందని, ఈ అమోఘమైన జంతువును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు.