Bandi Sanjay | కరీంనగర్ విద్యానగర్ జనవరి 14: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నదని, జాగ్రత్తగా ఉండాలని తాను సలహా ఇస్తే దానిని అర్థం చేసుకోకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ వల్లనే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడితే పొన్నం ప్రభాకర్కు ఎందుకు కోపం వస్తున్నదని ప్రశ్నించారు. తన ఓపికను పరీక్షించవద్దని హెచ్చరించారు. ‘బండి సంజయ్ పిల్లలు కొత్త బట్టలు వేసుకోవద్దా? కొత్త బండి కొనుక్కోవద్దా? ఎంపీగా ఉన్న తాను కటౌట్లు పెట్టుకోవద్దా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే, కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎకువగా గెలవాలని, మోదీని ఒప్పించి నిధులు తీసుకొస్తామని చెప్పారు.
ఇతర పార్టీలకు ఓటు వేస్తే అదనపు నిధులు కాదు కదా కొత్త అప్పులు కూడా పుట్టవని హెచ్చరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అయోధ్య రామమందిరం పూర్తికాకముందే పున:ప్రతిష్ఠ చేస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన బండి సంజయ్.. సాధు సంతువులు సూచించిన ముహూర్తం ప్రకారమే జరుగుతున్నదని తెలిపారు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు రామ మందిర నిర్మాణానికి అనుకూలమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.