హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని సీటు మోదీ జాగీరు కాదని, ప్రజల ఓటుతో ఎన్నికైన ఎంపీలు ఎన్నుకున్న వారు ప్రధాని అవుతారనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ హితవుపలికారు. బీజేపీకి గతంలో ఇద్దరే ఎంపీలు ఉండేవారని, ఆ విషయాన్ని మరిచిపోవద్దని చురకలంటించారు. ప్రజలు ఓట్లు వేస్తే బీజేపీ నేత ఎలా ప్రధాని కాగలిగారో.. బీఆర్ఎస్కు ప్రజలు ఓట్లు వేసి ఆదరిస్తే కేసీఆర్ కూడా ప్రధాని అవుతారని అన్నారు. దేశంలో బీఆర్ఎస్కు అపూర్వ ఆదరణ లభిస్తున్నదని, కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
బుధవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరుకు అదుపులేకుండా పోయిందని, సుపరిపాలనను అప్రదిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చివరకు జైలులో చిప్పకూడు తిన్న రేవంత్రెడ్డి కూడా కేసీఆర్ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రధాని కుర్చీ ఖాళీ లేదని అమిత్ షా అంటున్నారని, అదేం వారసత్వ కుర్చీ కాదని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఒక పిరికి ప్రధాని అని, అదానీ ఏజెంట్లు మోదీ, అమిత్ షాలు అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని రైతు యాత్రలు, పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మబోరని చెప్పారు.