Revanth reddy | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి కుల దురహంకారి అని, ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా గొల్ల, కురుమలు కంకణం కట్టుకొని ఓడిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. తమ జోలికొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలిసి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ గొల్లకురుమల వృత్తిని అవమానించడమేకాకుండా, మంత్రి తలసాని పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
మంత్రి తలసానిపై రేవంత్ వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ బడుగుల చెప్పారు. రాజకీయాలు చేసే శక్తి, పాలించే సత్తా కేవలం తమ కులానికి ఉన్నదని గతంలోనూ కుల దురహంకారంతో రేవంత్రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే రేవంత్రెడ్డికి గొల్లకురుమ వృత్తిపై మాట్లాడే నైతిక హక్కులేదని యెగ్గె మల్లేశం పేర్కొన్నారు. రేవంత్ సంస్కారహీనుడిగా వ్యవహరించటం తగదన్నారు.