హుజూర్నగర్టౌన్, జనవరి 5: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కండ్లతో చూడలేని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకొన్నారని అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా గైడ్లైన్స్ అతిక్రమించడం వల్లే రాష్ట్ర బీజేపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. నీటి పంపకాల కోసం కొట్లాడని తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రూ.50 వేల కోట్ల నిధులతో రైతు బంధు విడుదల చేసిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. సంక్రాంతి కంటే ముందే రాష్ట్రంలో పండుగ వాతావారణం నెలకొన్నదని పేర్కొన్నారు.