న్యూఢిల్లీ: జనగణనలో బీసీల కుల గణన చేయాలని న్యూఢిల్లీలోని రాష్ట్రీయ ఓబిసి మహాసంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీసీలకు రావాల్సిన వాటా ప్రకారం 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సంఖ్యను లెక్కించక పోవడం దురదృష్టకరమని చెప్పిన ఆయన.. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.
పార్లమెంట్ సభ్యునిగా బీసీలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, పార్లమెంట్ సమావేశాల్లో బీసీల సమస్యలపై కేంద్రంతో పోరాటం చేస్తామని అన్నారు. జనగణనలలో బీసీ కులగణన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మద్దతు తెలుపుతూ,శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు.
దేశవ్యాప్తంగా వచ్చిన అనేక బీసీ కమిషన్లు గానీ, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే వచ్చిన 240 బీసీ కమిషన్లు కూడా కుల గణన చేయాల్సిందేనని సిఫార్సులు చేసినా కేంద్రప్రభుత్వం మొండిగా, గుడ్డిగా, అవివేకంతో ఒప్పకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పేద వర్గాలకు న్యాయం జరుగుతోందని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు 90శాతం బీసీలకు అందుతున్నాయని, ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారని లింగయ్య యాదవ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాలతో సంబంధం లేకుండా అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 39 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 18 లక్షల వరకు ప్రైవేట్గా పరిశ్రమలు ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రంలో బీసీలను ఎవరు గుర్తించలేదని కోట్లు పెట్టి కొనలేని రాజ్యసభ పదవిని తనకు పైసా ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ అందించారని అన్నారు.
బీసీలంతా తమ పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలని కోరుకోవాలని అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. బీసీ జనాభాను తేల్చి చెబితే ఉద్యోగాలు చదువులో తమ వాటా తమకు వస్తుందన్నారు. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు లెక్కలు చేశారు తప్ప.. ఆ తర్వాత ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో ఏ ప్రభుత్వం కూడా బీసీలను లెక్కించ లేదని విమర్శించారు. జంతువుల సంఖ్య ను లెక్క పెడుతున్న ప్రభుత్వం బీసీల సంఖ్యను లెక్కించక పోవడం దురదృష్టకరమని, వెంటనే కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టాలని లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.