హైదరాబాద్, జూలై (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పునఃసమీక్షించాలని కోరుతూ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్సూద్కు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి లేఖ రాశారు. రాంసింగ్ విచారణ అధికారిగా బాధ్యతలు తీసుకోకముందే నిబంధనలకు వ్యతిరేకంగా విచారణ జరిపారని, పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. తనతోపాటు తన తండ్రి భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిని ఇరికించేందుకు సాక్షులను రాంసింగ్ బెదిరించారని పేర్కొన్నారు. తన పేరు చెప్పాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డిని థర్డ్ డిగ్రీతో టార్చర్ చేశారని, పలువురు సాక్షుల స్టేట్మెంట్లను పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. తానే హత్య చేసినట్టు ఒప్పుకున్న దస్తగిరిని అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేసిందని పేర్కొన్నారు. దస్తగిరి మందస్తు బెయిల్ పిటిషన్ను సీబీఐ కానీ, సునీత కానీ వ్యతిరేకించలేదని తెలిపారు. వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రెండో భార్య ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లేందుకే హత్య చేసి ఉండొచ్చనే కోణంలో ఎందుకు సీబీఐ విచారించలేదని ప్రశ్నించారు.
డ్రైవర్కు ప్రమాదమనే లేఖ దాచిపెట్టమని చెప్పా: సునీతారెడ్డి భర్త వాంగ్మూలం
డ్రైవర్ ప్రసాద్కు ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతోనే వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్టుగా భావిస్తున్న లేఖను బయట పెట్టవద్దని పీఏ ఎంవీ కృష్ణారెడ్డికి తొలుత సూచించానని సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. తన హత్యకు డ్రైవర్ ప్రసాద్ కారణమంటూ వివేకా రాసిన లేఖ గురించి కృష్ణారెడ్డి తనకు ఫోన్లో చెప్పారని వివరించారు. ఆ తర్వాత ఆ లేఖను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. అవినాష్కు వివేకా మద్దతుపై సీబీఐ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. హత్యకు ముందురోజు జమ్మలమడుగులోని అల్లె ప్రభావతమ్మతో వివేకా మాట్లాడారని, తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని, అవినాష్కు మద్దతు ఇవ్వాలని సూచించారని తెలిపారు. అయితే, ఆయన ఎంపీగా పోటీ చేయాలని భావించినట్టు తర్వాత తెలిసిందని పేర్కొన్నారు. వివేకా పేరుతో కొన్ని ఆస్తులున్నట్టు ఆయన హత్యకు ముందే తనకు తెలుసని సీబీఐ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శివశంకర్రెడ్డి సాధారణంగా వివేకా ఇంటికి వచ్చేవారు కాదని రాజశేఖర్రెడ్డి చెప్పారు.
తుది చార్జిషీట్ తప్పుల తడక: ‘ది వైర్’ కథనం
వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పుల తడకగా ఉన్నదంటూ ‘దివైర్’ వెబ్సైట్ ఒక కథనం ప్రచురించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ విచారణ ముగించిందని, చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని పేర్కొన్నది. వివేకా కుటుంబంలో ఆస్తి కోసం కుట్రలు జరిగినా సీబీఐ వాటిని పట్టించుకోలేదని, ముగ్గురు వ్యక్తుల సాక్ష్యాలు, కడప ఎంపీ సీటుపై మాత్రమే దృష్టి కేంద్రీకరించిందని అభిప్రాయపడింది. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు ఆస్తి తగాదాలను చిన్నవిగా చూపే ప్రయత్నం చేసిందని అభిప్రాయపడింది. హత్య కేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారమని, కానీ వీళ్లిద్దరూ నిజం చెప్తున్నారనడానికి ఎక్కడా ఆధారం లేదని పేర్కొన్నది.