హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఆయనొక ఫైర్ బ్రాండ్. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ను తక్కువ అంచనా వేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీకి సెక్యులరిజం ఎక్కడ ఉన్నదని ప్రశ్నించారు. ప్రధానిగా ఆయన తొలి ప్రసంగంలో, 1200 ఏండ్ల బానిసత్వం తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని, భారత్ను బ్రిటిషర్లు పాలించింది 200 ఏండ్లేనని చెప్పారు. ప్రధాని తరచూ మాట్లాడే ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ నిజమైతే గుజరాత్లో కనీసం ఒక్కరికైనా సీటు ఇచ్చి గెలిపించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మోదీ పాలనకు చరమగీతం పాడాలంటే 540 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండాలని.. రాహుల్, మమతా బెనర్జీ ప్రత్యర్థులుగా ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ఆర్ఎస్ఎస్ మంచిదని, ప్రధాని మంచివారంటూ మమత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దేశంలో ముస్లింల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నది తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కరే అని ఒవైసీ కుండబద్దలు కొట్టారు. రైతులకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయని వివరించారు.