హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలు పెంచుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాన్ ఏసీ థియేటర్లలో కనిష్ఠ ధరను రూ.30గా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏసీ థియేటర్లో కనిష్ఠ ధర రూ.50, మల్టీప్లెక్స్లో రూ.100+ జీఎస్టీగా నిర్ణయించారు. గరిష్ఠ ధరలను నాన్ ఏసీ రూ.70, ఏసీ రూ.150, మల్టీప్లెక్స్ రూ.250గా నిర్ణయించారు. అన్ని రకాల థియేటర్లలో గరిష్ఠ ధరలకు జీఎస్టీ వర్తిస్తుంది. నిర్వహణ చార్జీల కింద నాన్ ఏసీ థియేటర్లలో రూ.3, ఏసీ థియేటర్లలో రూ.5 వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయని జీవోలో స్పష్టంచేసింది. టికెట్లపై జీఎస్టీ, నిర్వహణ చార్జీలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చార్జీలు అన్నీ వేర్వురుగా ము ద్రించాలని థియేటర్ యాజమాన్యాలను ఆదేశించింది. సినిమా పరిశ్రమ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా జరిపిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం టికెట్ ధరల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం వివాదాస్పదమైంది.
సినిమా టికెట్ల ధర పెంపుదలపై జారీ చేసిన జీవోను ప్రభుత్వ న్యాయవాది టీ శ్రీకాంత్రెడ్డి శుక్రవారం హైకోర్టుకు అందజేశారు. దీనిని పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఎలాంటి మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. టికెట్ ధరల నియంత్రణ అంశంపై న్యాయవాది జీఎల్ నరసింహారావు దాఖలు చేసిన పిల్పై విచారణను మూసేసింది. సినిమా విడుదల సమయంలో టికెట్ల ధరలను పెంచుకొనేలా గతంలో థియేటర్ల యజమానులు పొందిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించారని, దీనిపై విచారణ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులను ఏయే సందర్భాల్లో, ఎవరెవరు, ఎలా ఉల్లంఘించారో తగిన ఆధారాలతో విడిగా వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చునని సూచించింది. టికెట్ల ధరల జీవోను థియేటర్లు ఉల్లంఘిస్తే తిరిగి హైకోర్టుకు రావచ్చని స్పష్టం చేసింది.