Tiger | ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిధిలోని అంకుసాపూర్తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి అంకుసాపూర్లో పెద్ద పులి సంచరించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక అడవుల నుంచి గ్రామాల్లోకి పులి వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
పెద్ద పులి సంచారం నేపథ్యంలో కాగజ్నగర్ – కనర్గావ్ – వాంకిడి రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధించినట్లు పేర్కొన్నారు. పులికి ఎవరూ కూడా హానీ కలిగించొద్దని కోరారు. అంకుసాపూర్, నారాపూర్, గొంది గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ జంతువులను గ్రామాల్లోకి రాకుండా, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరారు.
ఎండలు బాగా ముదిరిపోవడంతో.. దాహార్తిని తీర్చుకునేందుకు పులులు, ఇతర జంతువులు కుమ్రం భీం ఇరిగేషన్ ప్రాజెక్టు వద్దకు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పరిసరాల్లో పులి పాదముద్రలను గుర్తించామన్నారు. పులి సంచారంతో రైతులు పగటిపూట పొలాల్లోకి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.