హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రిసెర్చ్ కోసం ఆర్జీయూకేటీ, టీఎస్ కాస్ట్ మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఇరుసంస్థలు నూతన ఆవిష్కరణలు, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లను రూపొందించనున్నాయి. గురువారం హైదరాబాద్ సైఫాబాద్లోని అరణ్యభవన్లో టీఎస్ కాస్ట్ సభ్యకార్యదర్శి ఎం నగేశ్, ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ పీ సతీశ్కుమార్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.
ఈ సందర్భంగా అటవీ పర్యావరణ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ, బోధన, పరిశోధన రంగాల్లో అవకాశాల అన్వేషణకు ఈ ఒప్పందం మరింత దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి సహకారంతో బాసర ఆర్జీయూకేటీలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్లు పెరిగాయని చెప్పారు. ఆర్జీయూకేటీ సహకారంతో జిల్లాలను ఐటీ, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
న్యాక్తో ఐఐఐటీ బాసర ఎంవోయూ
మాదాపూర్, మార్చి 9: నైపుణ్య రంగంలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న న్యాక్తో గురువారం ఐఐఐటీ బాసర అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది. ఒప్పందంలో భాగంగా విద్యార్థులకు ప్లేస్మెంట్ లింక్డ్ ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాంను న్యాక్ అందించనున్నది. గురువారం హైదరాబాద్ మాదాపూర్లోని న్యాక్ ఆడిటోరియంలో ఐఐఐటీ వీసీ వెంకటరమణ, న్యాక్ డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాక్ సిబ్బంది పాల్గొన్నారు.