ములుగు, ఏప్రిల్ 1 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ జీవధార గోదావరి నదిలో ఎన్నడూలేని విధంగా నీటిమట్టం తగ్గిపోవడంతో జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పంపుహౌస్ వద్ద మోటార్లు నిలిచిపోయాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో కొన్ని రోజులుగా ఐదు మోటర్లతో గోదావరి నీటిని ఎగువ ప్రాంతాలకు పంపింగ్ చేస్తుండగా ఆదివారం సాయంత్రం మోటర్లన్నింటినీ నిలిపివేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
దేవాదుల పంపుహౌస్లో మోటా ర్ల కోసం తగిన నీటి మట్టాన్ని అందించేందుకు సమ్మక్క బరాజ్ నిర్మాణం చేపట్టగా సోమవారం నాటికి గోదావరి నీటి మట్టం 74.7మీటర్ల దిగువకు చేరింది. గతేడాది ఇదే నెలలో నీటితో కళకళలాడిన బరాజ్ వద్ద గోదావరి నది ప్రస్తుతం ఎండిపోయి కనిపిస్తున్నది.