హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మొదటి విడుతలో భాగంగా భవన నిర్మాణ రంగంలోని పని చేస్తున్న లక్ష మందికి సబ్సిడీపై మోటార్ సైకిళ్లను అందజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించినట్లు హరీశ్రావు పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.