యాదాద్రి, సెప్టెంబర్ 30 : బీజేపీ పూర్తిగా దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని, దాంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు గట్టిగా కోరుకొంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దిక్సూచిలా నిలిచాయని కొనియాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామా విలువ రూ.21 వేల కోట్లు అని చెప్పారు. మునుగోడు ప్రజలంతా అప్రమత్తమై బీజేపీ, రాజగోపాల్రెడ్డి కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.