సంక్రాంతికి సకినాలు, గారెల కోసం నూనె ప్యాకెట్లకు పోతే వెయ్యి రూపాయలు అయినయ్. పిండి, మసాలాలు
అదనం. నెలకు 8 వేల జీతం వచ్చే మాలాంటోళ్లు ఎట్లా బతికేది? – ఐదుగురు సభ్యులున్న కుటుంబ యజమాని
డిగ్రీ చదివే రోజుల్లో 10 రూపాయలకు ఓ కూర, చారు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు 30 పెట్టినా పప్పు కూడా ఇస్తలేరు. – కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ బ్యాచిలర్
గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రెండ్రోజులకు సరిపడినన్ని కూడా వస్తలేవు. – ఓ మధ్య తరగతి గృహిణి
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల బీజేపీ సర్కారు పాలనలో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొన్నది. ఫలితంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కడుపు నిండా తినడానికి కూడా భయపడే దుస్థితి దాపురించింది. 2014 నుంచి ఇప్పటివరకూ నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 300 శాతం పెరిగాయి. దీంతో వైద్యం, ఇతర అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు ఖాతాల్లో దాచుకొన్న డబ్బును కూడా పేద, మధ్య తరగతి జీవులు బయటకు తీయక తప్పడం లేదు. దీని వల్ల వారి పొదుపు ఖాతాల్లోని మూల ధనం గడిచిన 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోయింది. 2021-22 తొలి ప్రథమార్థంలో దేశంలోని సామాన్యుల పొదుపు ఖాతాల్లో రూ.17.2 లక్షల కోట్లు ఉండగా, 2022-23 ప్రథమార్థంలో ఈ మొత్తం రూ.5.2 లక్షల కోట్లకు క్షీణించింది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ ఒక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. గడిచిన ఏడాది కాలంలోనే కుటుంబావసరాల కోసం సామాన్యులు అదనంగా రూ.6 లక్షల కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించింది. ధరల పెరుగుదలే దీనికి కారణంగా తేల్చింది. బిస్కెట్లు, సబ్బులు, నూనెలపై ధరల వాత విధించినప్పటికీ, కొనుగోలుదారుల సంఖ్యలో తగ్గుదల నమోదు కాలేదని, రోజువారీ జీవితంలో వాటిని తప్పకుండా వినియోగించాల్సి రావడయే దీనికి కారణమని వెల్లడించింది.
దినదిన గండమే
2014 నుంచి ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం ఎక్సైజ్ పన్నులను పెంచింది. దీంతో వ్యవసాయ పెట్టుబడి పెరిగింది. రవాణా చార్జీలు, ఉత్పాదక ఖర్చులు పెరుగడంతో ఆ ప్రభావం అంతిమంగా సరుకులపై పడి ధరలు పెరిగినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు సభ్యులు ఉన్న ఓ కుటుంబానికి 2014లో వారానికి రూ.1000 ఖర్చయితే, ప్రస్తుతం అది రూ.1,638కి పెరిగింది. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడిని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పాల నుంచి అంత్యక్రియల వరకూ అన్ని వస్తువులు, సేవల మీద జీఎస్టీ పేరిట వాత పెడుతున్నది. దీంతో దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలు దినదిన గండంగా బతుకీడుస్తున్నారు.