ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 16: రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇది తన రాజకీయ జీవితంలో చూసిన విచిత్రమైన సంఘటన అని ఆయన అభివర్ణించారు. సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎస్టీఎస్ఏ) ఆధ్వర్యంలో మహనీయుల జయంతిని మంగళవారం ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో నిర్వహించారు.
ఎస్టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ల అజయ్ అధ్యక్షతన ‘మాదిగల వాటా కోసం మాట – సామాజిక తెలంగాణ సాధన కోసం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మోత్కుపల్లి మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యంత శక్తివంతులుగా ఉన్న మాదిగ సామాజికవర్గానికి ఎంపీ టీకెట్ కేటాయించకపోవడం పట్ల వారి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. తాను రేవంత్రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కానీ మాదిగల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల్లో తిరగలేకపోతున్నానని వాపోయారు. ఇప్పటికైనా సమయం ఉన్నదని, పార్టీ నాయకత్వం పునరాలోచించి, మాదిగలకు జనాభా అనుగుణంగా టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ప్రొఫెసర్ కాశీం, ఈరమిళ్ళ రాధిక, సురేందర్, నాగేశ్వరరావు, విద్యార్థి నాయకులు లింగంపల్లి మనోజ్, సోమశేఖర్, పాల్వాయి నగేశ్ తదితరులు పాల్గొన్నారు.