గంటల వ్యవధిలో ఇద్దరు మృతి
కల్వకుర్తి పట్టణంలో ఘటన
కల్వకుర్తి రూరల్, మే 29 : కొడుకు మృతి చెందిన వార్త విన్న తల్లి కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఆదివారం నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకొన్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తికి చెందిన సత్యంగౌడ్ (45) పట్టణంలో మిర్చి బండి పెట్టుకొని జీవనం సాగించేవాడు. సత్యంగౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం రాత్రి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
గాయపడిన అతడిని హైదరాబాద్లోని దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొడుకు మృతి చెందాడన్న విషయం చారకొండలోని కూతురి ఇంటి వద్ద ఉన్న తల్లి రుక్నమ్మ (65)కు తెలియడంతో ఆమె ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కుమారుడు, తల్లి ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో ఇద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు.