మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 21 : కాళ్ల కడియాల కోసం తల్లీకూతురు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కూతురు ఎనిమిది రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించింది. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. సీఐ స్వామిగౌడ్ కథనం మేరకు.. భూత్పూరు మండలం కొత్తూరుకు చెందిన రాజమ్మ, నాగమ్మ తల్లీకూతుళ్లు. నాగమ్మ (26)కు భర్త చెన్నయ్యతోపాటు పాప, బాబు ఉన్నారు. అయితే తల్లి రాజమ్మ తన కాళ్ల కాడియాలను కూతురు నాగమ్మకు కొన్ని రోజుల కిందట ఇచ్చింది. తన కడియాలు ఇవ్వాలని కూతురిని అడగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవపడ్డారు.
ఈ క్రమంలో ఈనెల 14న కూతురు నాగమ్మ మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె మృతదేహం బుధవారం రాత్రి టాయిలెట్లో కన్పించింది. వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే తల్లే కూతురిని బాత్రూంలోకి తీసుకెళ్లి హత్య చేసిందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.