రాంనగర్, మే 23: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఇటుక బట్టీల్లో పనిచేసే తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన విద్యాధర్ బిందానికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చింతకుంటలోని ఇటుకబట్టీలో పనిచేస్తూ అక్కడే కూతురు బాబీ బిందాని (18), కొడుకు దశరథ్ బిందానితో కలిసి ఉంటున్నది. విద్యాధర్ చిన్న భార్యతో కలిసి వేరే ఇంట్లో ఉంటూ వేరే ఇటుక బట్టీలో పని చేసుకుంటున్నాడు.
కాగా సమీపంలో ఉండే జగన్నాథ్ అనే వ్యక్తి పనికి పోయేందుకు గురువారం ఉదయం బేని బిందాని ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టడంతో విద్యుత్తు షాక్ రాగా వెంటనే కేకలు వేసి విద్యాధర్కు సమాచారం ఇచ్చాడు. అకడికి చేరుకున్న విద్యాధర్ కరెంటు వైర్లు తొలగించి లోనికి వెళ్లి చూడగా అతని పెద్ద భార్య బేని బిందాని, కూతురు బాబి బిందాని విద్యుత్తు షాక్తో మృతిచెంది ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అకడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి తెలిపారు.