హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉన్నత విద్యావ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉన్నదని. ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోనే అత్యుత్తమ విద్య అందుబాటులో ఉన్నదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ ప్రశంసించారు. తెలంగాణ విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తున్నారని, ఐఐటీల్లో చేరుతున్న వారిలో అత్యధికులు తెలంగాణ విద్యార్థులేనని పేర్కొన్నారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ నిర్వహించిన 6వ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి జగదీశ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. మన విద్యార్థులను మరింతగా ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరమున్నదని అన్నారు. యూజీసీ నిబంధనలను వీలైనంత త్వరగా అమలు చేయాలని అన్ని యూనివర్సిటీల వైస్చాన్స్లర్లను కోరారు.
ఎన్డీయూలో ఫిన్టెక్, డాటాసైన్స్ కోర్సులు
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్డీయూ) వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమవుతుందని జగదీశ్కుమార్ తెలిపారు. ఈ వర్సిటీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు విస్తృత ఉపాధి అవకాశాలున్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫిన్టెక్, డాటాసైన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు.
కోర్సుల రూపకల్పనలో వర్సిటీలకు స్వేచ్ఛ
వర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహిస్తున్నామని, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) సైతం వర్సిటీల స్వయంప్రతిపత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని జగదీశ్కుమార్ తెలిపారు. యూజీసీ ఓ నియంత్రణ సంస్థ (రెగ్యులేటర్)లా కాకుండా ఫెసిలిటేటర్గా మాత్రమే వ్యవహరిస్తున్నదని, కోర్సుల రూపకల్పనతోపాటు పలు ఇతర అంశాల్లో వర్సిటీలకే పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు.
తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధం
ఉన్నత విద్యలో తెలంగాణకు సహాయం చేసేందుకు యూజీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని జగదీశ్కుమార్ తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న నేషనల్ డిజిటల్ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులు ప్రవేశాలు పొంది అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
నాలుగేండ్ల డిగ్రీతో పీహెచ్డీ
నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసినవారు పీజీతో సంబంధం లేకుండా పీహెచ్డీలో చేరేందుకు వీలు కల్పిస్తూ ఇటీవలే మార్గదర్శకాలు విడుదల చేశామని జగదీశ్కుమార్ చెప్పారు. వచ్చే ఏడాది జూలై నుంచి పలు వర్సిటీలు పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీ విద్యార్థులు డిగ్రీ నాలుగో సంవత్సరంలో రిసెర్చ్, థీసిస్ సమర్పించాల్సి ఉంటుందని, ఇలా వీలుకాని పక్షంలో కోర్సువర్క్ తీసుకుని పూర్తి చేసుకోవచ్చని వివరించారు. గతంలో నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసి 75% మార్కులు సాధించినవారు ఇప్పుడు పీహెచ్డీలో చేరొచ్చని చెపారు. నూతన ఆవిష్కరణలతోపాటు ఆర్థికంగా మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాల్సిన అవసరం ఉన్నదని, యువతకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించినప్పుడే ఇది సాధ్యమని చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు సమష్టిగా కృషిచేసి ప్రపంచంలో భారత్ను అత్యున్నత స్థానానికి చేర్చాలని పిలుపునిచ్చారు.
త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు
యూజీసీ, ఏఐసీటీఈ, న్యాక్ తదితర సంస్థల స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ త్వరలోనే ఏర్పాటవుతుందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ చెప్పారు. వీటిన్నింటిని విలీనం చేస్తూ ఏర్పాటయ్యే కమిషన్ ఆవిర్భావ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. శనివారం తార్నాకలోని ఐఐసీటీలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో పలు వర్సిటీ వీసీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వర్సిటీలవారీగా కోర్సులు.. ప్రత్యేకతలపై ఆరా తీశారు. విద్యారంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, వీటిని ఆకళింపు చేసుకుంటూ వర్సిటీలు డిజిటలైజేషన్పై దృష్టి పెట్టాలని సూచించారు. వర్సిటీలు అంతర్జాతీయ వర్సిటీలతో ఎంవోయూలు కుదుర్చుకొని ట్విన్నింగ్ కోర్సులను నిర్వహించాలని వీసీలకు సూచించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీలు రవీందర్, సీతారామారావు, గోపాల్రెడ్డి, తాటికొండ రమేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.