హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం ఒక్కో సంఘానికి సగటున రూ.4.70 లక్షల రుణాన్ని అందించింది. ఈ అంశంలో జాతీయ సగటు మాత్రం రూ.2 లక్షలే. 2020-21లో కూడా రాష్ట్రంలో సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల వరకు రుణం అందించారు. ఒక్క ఏడాదిలోనే అది మరో రూ.70 వేలు పెరగటం విశేషం. ఈ ఏడాది నవంబర్ చివరినాటికే రుణాల లక్ష్యంలో 72 శాతం అందించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇప్పిస్తున్నారు. ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుండటంతో వడ్డీలేని రుణాలుగా పేరు పొందాయి. రుణాలను సంఘాలు సకాలంలో తిరిగి చెల్లిస్తుండటంతో ఏటేటా రుణ పరిమితిని పెంచుతున్నారు. ఈ రుణాల్లో 98 శాతం రికవరీ ఉంటున్నదని బ్యాంకర్లు చెప్తున్నారు. 2020-21లో రూ.10,448 కోట్ల రుణాన్ని 2.71లక్షల సంఘాలకు అందించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా రూ.12,046 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 1.85 లక్షల సంఘాలకు రూ.8,702 కోట్ల రుణాన్ని అందించారు. ఈ నెలాఖరుకు 80 శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వందశాతం రుణాలు అందించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. గతంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు 60 – 70 శాతమే అందించేవారు. రుణాలు వేగంగా జారీచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు. మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు అందివ్వాలన్న రిజర్వ్ బ్యాంకు సూచనలను రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తున్నారు. మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాల్లో అత్యధికం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల కోసమే ఖర్చు చేస్తున్నారు. చేతివృత్తులు, గృహ పరిశ్రమలు, స్వయం ఉపాధి కోసం కూడా వినియోగిస్తున్నారు. చాలామంది మహిళలు ఈ రుణాలతో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొంటున్నారు.