మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పట్టణం అనతి కాలంలోనే సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుందని రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula ) అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్(Mahaboobnagar) జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బీ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి శ్రీనివాస్గౌడ్(Minister Srinivas Goud)తో కలిసి తనిఖీ చేశారు.
అప్పన్నపల్లి రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పరిశీలిస్తూ కేవలం 12 నెలల్లోనే పూర్తి చేయడం పట్ల రాష్ట్రమంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కృషి ,పట్టుదల అర్థమవుతుందని అన్నారు. అనంతరం ఆర్ అండ్ బీ చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు . అశోక్ థియేటర్ చౌరస్తాలో చేపట్టిన రహనుమియా బ్రిడ్జి పనుల తనిఖీ అనంతరం మంత్రి వేముల మీడియాతో మాట్లాడారు.
అప్పన్న పల్లి మొదటి ఆర్వోబీ(ROB) ని 12 సంవత్సరాలలో నిర్మించగా 2 వ ఆర్వోబీ ని కేవలం 12 నెలల్లో నిర్మించడం అభినందనీయమన్నారు. జూన్ రెండు లోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జడ్చర్ల నుంచి మహబూబ్నగర్కు వచ్చే వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే గాక అనారోగ్యం పాలై రహదారి పై ప్రాణాలు వదిలేసేవారని గుర్తు చేశారు. అలాంటిది 12 నెలల్లోనే రెండవ ఆర్వోబీ ని పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల పాలమూరుకు తిరిగి వలసలు(Immigration) వస్తున్నారని పేర్కొన్నారు.
వారి వెంట మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ,మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు ఉన్నారు.