నల్లగొండ ప్రతినిధి, మార్చి26(నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి తాగునీటితోపాటు సాగునీటి అవసరాలు తీర్చేదే ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ). హైదరాబాద్ జంటనగరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగునీటి సరఫరాతోపాటు మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తూ జిల్లా ప్రజలకు గుండెకాయలా ఉంటున్నది. ఇలాంటి ప్రాజెక్టు పరిధిలో ఈ సీజన్లో పూర్తిస్థాయిలో కరువుఛాయలు నెలకొన్నాయి. సాగర్కు ఈసారి సరైన వరద రాకపోవడం వల్ల ఏఎమ్మార్పీ ఆయకట్టుకు సాగునీటి విడుదల జరుగలేదు. యాసంగిలో ఒక్కసారి కూడా ప్రధాన కాల్వ ద్వారా చెరువులు, కుంటలను నింపలేదు. ఏఎమ్మార్పీ ఆయకట్టు పరిధిలో రైతులు వరి కంటే కూడా ఎక్కువగా బత్తాయి, నిమ్మ వంటి తోటలు సాగు చేస్తారు. వరి పంట ఎండిపోతే ఈ సీజన్ వరకే నష్టం జరుగుతుంది. కానీ తోటలు ఎండిపోతే ఐదారేండ్ల దిగుబడితోపాటు ఇన్నాళ్లూ పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా అవుతుంది. రైతులకు కోలుకోలేని దెబ్బతినాల్సి వస్తుంది. ఏఎమ్మార్పీ ఆయకట్టుకు సాగర్ నుంచి నీళ్లు విడుదల కాకపోవడంతో డిసెంబర్ నాటికే అత్యధిక చెరువులు, కుంటలు వట్టిపోయాయి. బోర్లు, బావుల్లోనూ నీటిమట్టాలు పాతాళంలోకి వెళ్లడంతో వరితోపాటు తోటలకు నీటిఎద్దడి నెలకొంది. వరి పంటను దాదాపుగా కోల్పోగా తో టలను కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లు, బోర్లు అద్దెకు తీసుకుంటూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ సీజన్లో మొత్తం 1.80 లక్షల ఎకరాల్లో వరితోపాటు కూరగాయలు, ఇతర పంటలు సాగైనట్టు అంచనా. ఇవి కాకుండా మరో 65 వేల ఎకరాల వరకు పండ్ల తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం లక్షన్నర ఎకరాల పంటలకు నీటి ఎద్దడి నెలకొన్నది. ఇప్పటికే 75వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయినట్టు అంచనా. నల్లగొండ జిల్లాలోని 13 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఏఎమ్మార్పీ ఆయకట్టులోని బావుల్లో చుక్క నీరు లేకపోగా బోర్లు వట్టిపోతున్నాయి. పది మంది రైతుల్లో కనీసం ఆరేడుగురు రైతులకు చెందిన ఒకటో, రెండో బోర్లు ఎండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో సంక్రాంతి తర్వాత నుంచి బోర్ల తవ్వకాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కో ఊరిలో వందల బోర్లు వేశారు. పదెకరాలకు పైగా సాగుచేసే రైతు సగటును పదికి పైనే బోర్లు వేసినట్లు అంచనా. పండ్ల తోటలు ఎక్కువగా ఉన్న పల్లెల్లో పగలు, రాత్రి తేడా లేకుండా బోరుబండ్ల శబ్దాలు హోరెత్తుతున్నాయి. పంట పొలాల్లో ఎక్కడ చూసినా నీళ్లు రాక వదిలేసిన బోరు గుంతలే ప్రత్యక్షమవుతున్నాయి. డీ-5 నుంచి డీ-55 వరకు ఉన్న హైలెవల్తోపాటు లోలెవల్ కాల్వల కింద దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు 300-400 ఫీట్లలోతు బోర్లు వేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు. వచ్చే ఏప్రిల్, మే నెలలను ఊహించుకుంటేనే అన్నదాతల కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేటి పరిస్థితులు చూస్తే 20 ఏండ్ల కిందట పరిస్థితులు కండ్ల ముందు మొదలాడుతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు.
నీళ్లు పడని ఈ బోరును చూపిస్తున్న ఈ రైతు పేరు కుందూరు రాఘవరెడ్డి. ఊరు ఏఎమ్మార్పీ పరిధిలోని డీ-37 ప్రధాన కాల్వ ఏరియాలోని తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం. 20 ఎకరాల్లో బత్తాయి, నిమ్మ తోటలు, 3 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పదేండ్లుగా ఐదు బోర్లతో సమృద్ధిగా పంటలకు నీరందిస్తున్నాడు. డిసెంబర్ నుంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. కండ్ల ముందే ఎండుతున్న చేనును కాపాడుకునేందుకు రాఘవరెడ్డి బోర్లు వేయడం మొదలుపెట్టాడు. ఒకదాని మీద ఒకటి చొప్పున మొత్తం 32 బోర్లు వేశాడు. రెండు నెలల కాలంలో 20 ఎకరాల్లో అన్నివైపులా నీటి కోసం శోధించాడు. సుమారు రూ. 10 లక్షలు బోర్ల పేరుతో భూమిలో పోశాడు. అయినా తోటలకు సరిపడా నీళ్లు రాలేదు. ఇది ఒక్క రాఘవరెడ్డి బాధే కాదు. ఏఎమ్మార్పీ పరిధిలోని మెజార్టీ పండ్ల తోటల రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. వారంతా నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ఉపశమన చర్యలూ లేకపోవడం రైతులను మరింత కుంగదీస్తున్నది.
మాది ముషంపల్లి గ్రామం. రెండు దశాబ్దాల తరువాత మా ఊరికి కరువొచ్చింది. 20 ఎకరాల్లో బత్తాయి తోట, మరో 15 ఎకరాలలో వరి పొలం పెట్టిన. మరో ఐదు ఏకరాలు కౌలు తీసుకుని వరి ఏసిన. నా పంటల సాగుకు పది బోర్లు ఉండేవి. యాసంగిలో మరో 7 బోర్లు వేశా. ఒక్కో బోరు 300 ఫీట్ల నుంచి 400 ఫీట్ల వరకు వేసినా చుక్క నీరు పడలే. దిక్కుతోచక నా పాత బోర్లనే కడిగించా. అప్పటికే వరి పంట 10 ఎకరాల మేర ఎండిపోయింది. ఇక బత్తాయి తోట ఎండిపోతుందనే భయంతో నిద్ర పడుతలేదు. ట్యాంకర్ల తోటి నీటిని తెచ్చి బత్తాయి మొక్కలను కాపాడుకుంటున్న.
– బైరెడ్డి అనంతరెడ్డి, ముషంపల్లి, నల్లగొండ మండలం