PRLIS Project | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కృష్ణమ్మ ప్రతి చుక్క నీటినీ సద్వినియోగం చేసుకొనేందుకు రంగం సిద్ధమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించేందుకు విస్తారమైన నెట్వర్క్ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్రధాన భూమిక పోషిస్తున్నది. ఈ రిజర్వాయర్ కిందే ప్రాజెక్టు మొత్తం ఆయకట్టులో దాదాపు 75 శాతం ఉండటం విశేషం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ కీలకంగా నిలువనున్నది. ప్రాజెక్టు మొత్తం ఆయకట్టులో 75 శాతానికిపైగా ఈ రిజర్వాయర్ కిందే ఉన్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, 70 మండలాల పరిధిలోని 1,226 గ్రామాలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) తెలంగాణ ప్రభుత్వం 2015లో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో తాగునీటికి పనులను, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇప్పటికేమొదటిదశ పనులను చేపట్టింది. నాగర్కర్నూలు జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు పనులను 21 ప్యాకేజీలుగా విభజించింది. అందులో కేపీ లక్ష్మీదేవిపల్లి మినహాయించి ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించి అప్రోచ్ చానళ్లు, పంప్హౌస్ల, సర్జ్పూల్లు, సొరంగాలు, లింక్ కాలువలు, ప్రధాన రిజర్వాయర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసింది. రెండో దశలో సాగునీటి పారుదలకు సంబంధించి ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కెనాల్స్ పనులను చేపట్టాల్సి ఉన్నది. ఇటీవలే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను మంజూరు చేయాలని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) కూడా కేంద్రానికి సిఫారసు చేయడంతో రెండోదశ పనులను చేపట్టేందుకు కూడా ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 67.97టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మొత్తం 6 రిజర్వాయర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కేపీ లక్ష్మీదేవిపల్లి (2.5 టీఎంసీలు) మినహా మిగిలిన 5 రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టింది. పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. అంజనగిరి (నార్లాపూర్) 8.51 టీఎంసీలు, వీరాంజనేయ (ఏదుల) 6.55 టీఎంసీలు, వెంకటాద్రి (వట్టెం) 16.74 టీఎంసీలు, కురుమూర్తిరాయ (కరివెన) 17.34 టీంఎసీలు, ఉద్దండాపూర్ 16.03 టీఎంసీలు కాగా, వీటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 65.25 టీఎంసీలు. అంజనగిరి, వీరాంజనేయ రిజర్వాయర్ల కింద ఆయకట్టు ప్రాంతం ఏమీ లేదు. ఆయకట్టు వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి ప్రారంభమవుతుంది. వెంకటాద్రి నుంచి హైలెవల్, లో లెవల్ కాలువల ద్వారా 1.33 లక్షల ఎకరాలకు, కురుమూర్తిరాయ నుంచి 1.82 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 3.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ప్రాజెక్టులో మిగిలిన దాదాపు 9 లక్షల ఎకరాలకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచే సాగునీరు అందనున్నది.
కాల్వలపైనా లిఫ్టులు
ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఎడమ ప్రధాన కాలువ పొడవు 120 కిలోమీటర్లు. దాని ద్వారా వికారాబాద్ జిల్లాలో దాదాపు 2.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ కాలువ 16.5 కిలోమీటర్ వద్ద మరో రెండు ప్రధాన కాలువలను తీయనున్నారు. ఒకటి 90 కిలోమీటర్ల పొడవు ఉండే మద్దూరు కాలువ కాగా, దీని కింద 1.74 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా లో, అతిస్వల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఆయకట్టు ఉన్నది. మరో కాలువను 20 కిలోమీటర్ల పొడవుతో హన్వాడ వరకు ఏర్పాటుచేస్తారు. ఈ కాలువ కింద మహబూబ్నగర్ జిల్లాలో 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ రిజర్వాయర్ దక్షిణ ప్రధాన కాలువ ద్వారా 30 వేల ఎకరాలకు, ఫస్ట్ రైట్ కెనాల్ ద్వారా 9 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఈ ఆయకట్టు మొత్తం మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నది. రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేయనున్న 2వ రైట్ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తం ఆయకట్టులో దాదాపు 75 శాతం ఉద్దండాపూర్ రిజర్వాయర్ కిందనే ఉన్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈ రిజర్వాయర్ జీవనాడిగా మారనున్నది. అ ప్రాజెక్టు పరిధిలోకి రాని ఎత్తులో ఉన్న భూములకు కూడా సాగునీటిని అందించేందుకు రిజర్వాయర్ నుంచి వెళ్లే పలు ప్రధాన కాలువలపై పలు చోట్ల చిన్నపాటి లిఫ్ట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తుది.
ఇప్పటికే తొలిదశలో భాగంగా తాగునీటి కోసం చేపట్టిన మెయిన్ ట్రంక్ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తాగునీటి పనుల్లో భాగంగానే ప్రధాన కాలువల తవ్వకం చేపట్టాల్సి ఉన్నది. ప్రధాన కాలువ పనులన్నీ ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత ఆ రిజర్వాయర్పై ప్రత్యేక దృష్టి సారించింది. తాగునీటి కోసం ఈ రిజర్వాయర్ నుంచి చెరువులను నింపేందుకు కాలువల పనులను చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే సుమారు రూ.5,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉద్దాండాపూర్ దిగువన కరివెన, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో దాదాపు 1,100 చెరువులను నింపి తాగునీటిని సరఫరా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనకు నూతన సెక్రటేరియట్ను ప్రారంభించిన రోజునే సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు.
ఉద్దండాపూర్ రిజర్వాయర్ ముఖ్య వివరాలు