హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వరుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడని ఆరా తీసి పెండ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సర్వసాధారణం. నేటి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సాఫ్ట్వేర్ ఉద్యోగులకిచ్చి పెండ్లి చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ, దేశంలో సైబర్ నేరగాళ్లకు అడ్డాగా ఉన్న జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. ఆయా ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లతో పెండ్లి సంబంధాలు కుదుర్చుకునేందుకు యువతుల తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. చేసేది నేరాలైనా వారి సంపాదన సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే అధికంగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఆయా ప్రాంతాల్లో సైబర్ నేరాలను అణిచివేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా నిరంతరం కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు.
తెలంగాణ పోలీసులంటే హడల్
హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిరుటి వరకు నిత్యం 50కిపైగా సైబర్ మోసాలు జరిగేవి. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ మోసాలపై స్థానిక ప్రజల్లో అవగాహన పెరగడం, సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రంలో నక్కినా తెలంగాణ పోలీసులు వేటాడి పట్టుకొస్తుండటం ఇందుకు కారణం. దీంతో వారు తెలంగాణ వైపు చూసేందుకే హడలిపోతున్నారు. కానీ, పార్ట్టైమ్ జాబ్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో గత కొంత కాలం చైనీయులు మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి సాగుతున్న మోసాలకు జార్ఖండ్లోని జామ్తార, రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన సైబర్ నేరగాళ్లు సహకరిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.