Hyderabad metro | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో అత్యాధునిక ప్రజా రవాణా సాధనమైన హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నది. మెట్రోను ఆదరించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మెట్రో రైలు సేవలు ప్రారంభమైన 2017 నవంబర్ 29 నుంచి ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణం చేశారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శనివారం తెలిపారు.
మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నదని, ప్రస్తుతం పని దినాల్లో రోజుకు 4.9 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేసే అవకాశం ఉందని తెలిపారు. మెట్రో రైలులో ప్రయాణించే వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు (రోజుకు 1.40 లక్షలు) ఉండగా, విద్యార్థులు (రోజుకు 1.20 లక్షలు) దాకా ఉన్నారని పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రయాణాన్ని యువతరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.