హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్ ఇంజినీరింగ్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో 19వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల లెక్క ఇది. ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థుల రిపోర్టింగ్ గడువు ముగిసింది. మొత్తం 64వేలకు పైగా విద్యార్థులు రిపోర్ట్ చేశారు.
రిపోర్టింగ్ చేయని వారి సీట్లు ఆటోమెటిక్గా రద్దు అవుతాయి. ఈ నేపథ్యంలో మొత్తం 19,049 సీట్లు మిగిలాయి. ఈ సీట్ల భర్తీకి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో 17 నుంచి 19 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 23న సీట్లు కేటాయిస్తారు. కంప్యూటర్సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 3వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. ఈ ఖాళీ సీట్లన్నీ గ్రామీణప్రాంతాల్లోని కాలేజీలు, అంతగా ప్రాచుర్యంలేని కాలేజీల్లోనే ఉన్నట్టుగా అధికారులు తెలిపారు.