వరంగల్ : పదేండ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆదరించి పట్టం కట్టాలని, తన బలం..బలగం నియోజకవర్గ ప్రజలేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy )అన్నారు. సంగెం మండలం తిమ్మాపూర్, గాంధీనగర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో కుంకమదిద్దారు. కోలాటలతో అపూర్వ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ..పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఒక్కొక్కటిగా వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోనే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందన్నారు.
మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. మండలంలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో ఏర్పాటవుతున్న కంపెనీలలో నియోజకవర్గానికి చెందిన మహిళలకు, యువతకు ఉద్యోగాల నియామకంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి దీవిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తానని, మీకు అండగా ఉంటానని తెలిపారు.