హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం.. ఆ భోజనం తయారు చేసే వంటవాళ్ల పారితోషికాన్ని పెంచింది. ప్రస్తుతం వారికి నెలకు రూ.1000 చొప్పున పారితోషికం అందుతుండగా.. ఇప్పుడు దాన్ని రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి హరీశ్రావు ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలోని మొత్తం 28,606 పాఠశాలలకు చెందిన 25.26 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారి కోసం 54,201 మంది వంటవాళ్లు పని చేస్తున్నారు. వారి పారితోషికాన్ని ఇప్పుడు రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసే 25.26 లక్షల మంది విద్యార్థులతోపాటు, 4,237 హాస్టళ్లు, గురుకులాల్లోని 9.77 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యం భోజనాన్ని సమకూరుస్తున్నది. అందుకోసం ప్రతి నెల 21,868 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని, పోర్టిఫైడ్ రైస్ను సరఫరా చేస్తున్నది.