నైరుతి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీగా
హైదరాబాద్ వాతావరణకేంద్రం హెచ్చరిక
దమ్మాయిగూడలో 9.15 సెం.మీ. వర్షం
హైదరాబాద్, జూన్ 14 (నమసే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వానలు కురిశాయి. అన్ని జిల్లాల్లో తొలకరి పలకరించింది. అన్నదాత విత్తనాలు విత్తేందుకు సిద్ధమయ్యాడు. గడిచిన 24 గంటల్లో ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలో 9.15, చర్లపల్లిలో 9, కామారెడ్డి జిల్లా బిచుకుంద, జుక్కల్లో 8, ఖమ్మంలో 7.63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వచ్చే రెండు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నేడు 16 జిల్లాల్లో భారీ వానలు
దక్షిణ యూపీ నుంచి తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతున్నదని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో 18వ తేదీ వరకు ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురువచ్చని పేర్కొన్నది.