హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలం ధాన్యం సేకరణ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ముగిసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్నతాధికారులతో కలిసి వానాకాలం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం సేకరణ ఏఏటికాయేడు పెరిగిపోతుందని వెల్లడించారు.
అక్టోబర్ 21న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా 94 రోజుల పాటు కొనసాగిందని అన్నారు. ఎక్కడైనా ఆలస్యంగా నాట్లు వేసిన రైతుల వద్ద ధాన్యం ఉంటే ఈ నెల 24 వరకూ సేకరిస్తామని అన్నారు. రికార్డు స్థాయిలో 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. రైతులకు అందుబాటులోనే 7024 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు.
వీటి ద్వారా 13,570 కోట్ల విలువ గల 64.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 9 లక్షల 76వేల మంది రైతుల నుంచి సేకరించామన్నారు. ఓపీఎంఎస్ లో నమోదైన 12,700 కోట్లను చెల్లించామని మిగతావారికి సైతం వారం రోజుల్లోనే డబ్బులు అందజేస్తామన్నారు. ధాన్యం సేకరణకు 16 కోట్ల గన్నీలు వాడగా అదనంగా మరో ఐదున్నర కోట్ల గన్నీలు అందుబాటులో ఉంచామని తెలిపారు.
అత్యధికంగా నిజామాబాద్ లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు
ఈ వానాకాలంలో అత్యధికంగా నిజామాబాద్ లో 5.86 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 4.75, నల్గొండలో 4.13, మెదక్ 3.95, జగిత్యాలలో 3.79 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని మంత్రి పేర్కొన్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 2,264 మెట్రిక్ టన్నులు, మేడ్చల్లో 14,361, ఆసిఫాబాద్ లో 21,548, రంగారెడ్డి 22,164, గద్వాల్లో24181 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. ఈ ధాన్యం సీఎంఆర్ ప్రక్రియ సైతం వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ ఉషారాణి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.