హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని అన్ని స్టేడియాలను జైళ్లుగా మార్చి, సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను అందులో నిర్బందించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రం పన్నిన కుట్ర అని అర్థమై, తాము ఆ ఒత్తిడికి తలొగ్గలేదని స్పష్టం చేశారు. తాము అన్నదాతల పక్షానే నిలబడ్డామని చెప్పారు. రైతులు చేపట్టిన ఆందోళన పంజాబో, హర్యానానో, మరో రాష్ర్టానికో సంబంధించిన అంశం కాదని.. యావత్తు దేశ సమస్య అని తెలిపారు.
అందుకే రైతుల ఆందోళనకు తమ ప్రభుత్వం అండగా నిలిచిందని, వారికి వసతి సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున రైతుల కుటుంబాలను ఆదుకొనే ప్రయత్నం చేశామని చెప్పారు. రైతుల ఆదాయం పెంచటంపైనే తమ దృష్టి ఉంటుందని వివరించారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించి అమరులైన రైతు కుటుంబాలను ఆదుకొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముందుకు రావటం అభినందనీయమని కేజ్రీవాల్ కొనియాడారు. ఆ కుటుంబాలకు యావత్తు దేశం అండగా ఉంటుందని తెలంగాణ సర్కారు చాటి చెప్పిందని శ్లాఘించారు.
దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక న్యాయవాది తన కొడుకు న్యాయవాది కావాలని కోరుకొంటున్నారు.. సినిమా యాక్టర్ తన కొడుకును యాక్టర్ చేయాలని అనుకొంటున్నారు.. డాక్టర్ కూడా డాక్టర్ను చేయాలని కోరుకొంటున్నారు.. కానీ, రైతు ఆ విధంగా ఎందుకు కోరుకోవటం లేదో ఆలోచించాలని కేజ్రీవాల్ అన్నారు. రైతు కూడా తన కొడుకును రైతు చేయాలని కోరుకొనే రోజులు రావాలని అభిలషించారు. గల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికీ తెలంగాణ ప్రభుత్వం ముందుకురావటం అభినందనీయమని కేజ్రీవాల్ ప్రశంసించారు.
ఉద్యమ నాయకుడు కేసీఆర్కు రైతుల సమస్య తెలుసు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఉద్య మ నాయకుడు కావటంతో రైతు ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను ఆదుకోవటానికి ముందుకువచ్చారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ అ న్నారు. ఈ నిర్ణయం అభినందించదగ్గదని కొనియాడా రు. యావత్తు దేశ రైతాంగం కోసం, దేశ రక్షణ కోసం అమరులైనవారి కుటుంబాలను ఆదుకోవటానికి తెలంగాణ సర్కారు ముందుకు రావటం ఒక మంచి సందేశా న్ని ఇస్తుదని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం ఆయా కు టుంబాల్లో మనోధైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారు.