బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి. అటవీ అధికారులు, పోడు రైతుల పంచాయితీకి మోదీనే కారణం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులే కదా? ఇద్దరూ కలిసి ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలనే డిమాండ్ పెట్టాలి. మీ నియోజకవర్గాల్లో మీ చేతుల మీదుగానే పట్టాలు ఇప్పిస్తాం. -మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తున్నదని ఆరోపిస్తున్న బీజేపీ నేతలకు, నరేంద్రమోదీ ప్రభుత్వం దేశాన్ని అప్పులపాలు చేస్తున్న విషయం కనిపించటంలేదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తాము చేసిన అప్పుల్లో ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేశామో చెప్పగలమని, గత ఎనిమిదేండ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసిన మోదీకి.. ఆ సొమ్మును ఏం చేశారో చెప్పే దమ్ముందా? అని నిలదీశారు. ధరణిపై విపక్షాల విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. ధరణి ఒక విప్లవమని, దాని ఫలితాలు ముందుముందు కనిపిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మోదీ అప్పు రూ.100 లక్షల కోట్లు
రాష్ర్టాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలో కూర్చేశారని బీజేపీ నేతలు అర్థ లేని ఆరోపణలు చేస్తున్నారు. మరి మోదీ ఏం చేశారో ఒక్కసారైనా ఆలోచించారా? 2014కు ముందు 67 ఏండ్లలో ప్రధానులందరూ కలిసి చేసిన అప్పు రూ.56 లక్షల కోట్లు. మోదీ ఈ ఎనిమిదేండ్లలో చేసిన అప్పు రూ.100 లక్షల కోట్లు. వచ్చే మార్చి నాటికి మోదీ చేసిన అప్పు రూ.100 లక్షల కోట్లు దాటుతుందని అధికారిక లెక్కలే చెప్తున్నాయి. ఆత్మనిర్భర్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అందులో రూ.15 వేలకోట్లే క్షేత్రస్థాయికి చేరాయని కేంద్రం చెప్పింది. అంటే ఒక్క శాతం కూడా ఇవ్వలేదు. ఇంతకంటే సిగ్గుచేటు, దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ప్రజా సంక్షేమంపై కేంద్రానికి ఉన్న నిబద్ధత ఇదీ. మోదీ దివాళాకోరు విధానాలను తట్టుకోలేక ఆర్థికవేత్తలు దేశాన్ని వదిలి పారిపోతున్నారు. రెవెన్యూ మొబిలైజేషన్లో కేసీఆర్ నాయకత్వం దేశానికే ఆదర్శం. అన్ని రంగాల్లో జాతీయ సగటు కంటే రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటు సాధిస్తున్నది. అందుకే తెలంగాణకు మార్కెట్లో పరపతి ఉన్నది. తెలంగాణకు చెందిన 40 ఏండ్ల బాండ్స్ను కూడా తీసుకొంటున్నారు. వేరే ఏ రాష్ర్టానికి సాధ్యం కాలేదు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే అప్పులు
అప్పులు తీసుకొనే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం 23. ప్రభుత్వం ఈ రుణాలను రాష్ట్ర భవిష్యత్తు కోసమే.. సాగు, తాగునీరు, విద్యుత్తు.. ఇలా అనేక రంగాలకు కేటాయించింది. అయినా అది అప్పు కాదు. పెట్టుబడి. తెలంగాణ తనకాళ్ల మీద తాను నిలబడే సొంత ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మిగులు రాష్ట్రం. 2014లో తెలంగాణ ఏర్పడేనాటికి మిగులు రాష్ట్రమే.. ఇప్పుడు కూడా మిలుగు రాష్ట్రమే. వచ్చిన ఆదాయాన్ని జీతభత్యాలకు, ఇతర ఖర్చులకు మాత్రమే సరిపెడితే మిగులు కనిపిస్తుంది. కానీ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అదనపు హంగులు సమకూర్చే పనిలో ఉన్నది. ఇంటింటికీ నీళ్లు, 24 గంటల విద్యుత్తు, కోటి ఎకరాలకుపైగా మాగాణం, కొత్త పరిశ్రమల స్థాపన.. వీటన్నింటి కోసం రుణాలు సేకరిస్తున్నాం. తీసుకొన్న అప్పుకన్నా ఎక్కువ రాబడి వచ్చే పరిస్థితులు సృష్టిస్తున్నాం. ఇది తెలియనివాళ్లు అడ్డుగోలుగా వాగుతారు. దాన్ని వాట్సాప్ యూనివర్సిటీ అటూ ఇటూ తిప్పుతుంది. రాష్ట్రం చేసిన అప్పులను ఎక్కడెక్కడ ఖర్చుపెట్టామో చెప్పే దమ్ము నాకుంది. మరి.. రూ.100 లక్షల కోట్లు ఎక్కడెక్కడ పెట్టారో చెప్పే దమ్ము, ధైర్యం మోదీకి ఉన్నదా? వేతనాలు ఒకటి, రెండురోజులు ఆలస్యమైతేనే రాద్ధాంతం చేస్తున్నారు. గత ఎనిమిదేండ్లలో జీతాలు 73% పెంచాం. ఈ విషయం ఎందుకు కనిపించడం లేదు?
మా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సేవ చేస్తున్నరు
రాష్ట్రంలో సర్పంచి నుంచి మంత్రి వరకూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ప్రజలతోనే ఉంటున్నారు. భారీ వర్షాలు పడుతున్న ప్రస్తుత సమయంలో మంత్రులు కొప్పల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు నీళ్లలోనే తిరుగుతున్నరు. మంత్రి అజయ్ భద్రాచలంలో నీట మునిగిన ఇండ్లు దగ్గరుండి ఖాళీ చేయిస్తున్నరు. వారి పనితీరు ఆదర్శనీయం. వరదలకు పంప్హౌజ్లు మునుగడం సాధారణం కేసీఆర్ వల్లే వరదలు వచ్చినట్టు విపక్షాలు మాట్లాడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి, శ్రీశైలం పంప్హౌజ్లు మునిగాయి. 2004లో జమ్ముకశ్మీర్లో, 2009లో ఉత్తరాఖండ్లో ఇలానే జరిగింది. పంప్హౌజ్లు నదుల పక్కనే ఉంటాయి కాబట్టి మునగడం సర్వ సాధారణం. కడెం ప్రాజెక్టును నిజాం హయాంలో కట్టారు. దాని డిశ్చార్జి కెపాసిటీ 2.5 లక్షల క్యూసెక్కులు. ఇప్పుడు సుమారు 6 లక్షల క్యూసెక్కులు వచ్చాయి. అయినా తట్టుకొని నిలబడ్డది. దీని గురించి ఎందుకు మాట్లాడరు? వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వానిదా బాధ్యత? ప్రకృతిని ఎవరైనా కట్టడి చేయగలరా? కనీస జ్ఞానం లేకపోతే ఎలా? పంప్హౌజ్ ఎందుకు మునిగిందో సెంట్రల్ వాటర్ బోర్డు టీమ్ను పంపి ఎంక్వైరీ చేయమనండి. మాకేం అభ్యంతరం లేదు. దేశంలో ఎక్కడెక్కడ మునిగాయో అన్నిచోట్లకు పంపమనండి.
పోడు పాపం కేంద్రానిదే
ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని 2016లో యూపీఏ ప్రభుత్వం తెచ్చింది. దాని ప్రకారం 2005లోపు పోడు నరికిన వాళ్లకు పట్టాలివ్వాలి. అందుకు అనుగుణం పట్టాలిచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ ఈ మధ్య లెక్కలు తీయిస్తే 12 లక్షల ఎకరాలకు పట్టాలు కావాలని తేలింది. అందులో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారు. ఆర్వోఎఫ్ఆర్ ప్రకారం గిరిజనులకే ఇవ్వాల్సి ఉంటుంది. అందరికీ పట్టాలిచ్చే అవకాశం లేదు. ఆ చట్టాన్ని సవరించాలి. 2020 వరకూ పోడు నరికినవారికి అర్హత కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అది కేంద్రం చేతిలో ఉన్నది. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి సవరించాలి. అప్పటివరకు పోడు భూములకు పట్టాలివ్వడం కుదరదు. పోడు సమస్యపై నిరుడు అక్టోబర్లో సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కానీ మోదీ స్పందించలేదు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి. అటవీ అధికారులు, పోడు రైతుల పంచాయితీకి మోదీనే కారణం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎంపీలే కదా? ఇద్దరూ ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలనే డిమాండ్ పెట్టాలి. మీ నియోజకవర్గాల్లో మీ చేతుల మీదుగానే పట్టాలిప్పిస్తాం. గిరిజనుల హక్కులను చిదిమేస్తూ పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది. గిరిజనుల అనుమతి లేకుండానే అటవీభూములను స్వాధీనం చేసుకొనేలా చట్టం చేస్తున్నారు. ఓవైపు గిరిజన మహిళను రాష్ట్రపతిని చేస్తున్నామంటూ.. మరోవైపు గిరిజనుల హక్కులకు గండికొడుతున్నారు. ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక, మణుగూరు పంచాయతీలను మున్సిపాలిటీలు చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. పీసా చట్టం ప్రకారం ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ అంగీకారం కావాల్సి ఉన్నది. కానీ కౌన్సిల్ తిరస్కరించటంతో చేయడంతో ఆ నాలుగు నేటికీ గ్రామ పంచాయతీలుగానే మిగిలిపోయాయి.
రాహుల్గాంధీ రెండు రోజులు ఉండాలి
రాహుల్గాంధీ సిరిసిల్లకు వచ్చినప్పుడు రెండు రోజులు ఉండమని కోరుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిరిసిల్ల ఎలా ఉండె? ఇప్పుడెలా ఉందో చూసి నేర్చుకోవాలి.‘రాహుల్గాంధీ.. కేసీఆర్ రిజర్వాయర్లు ఎట్లా కట్టిండో, అపెరల్ పార్క్ ఎలా వచ్చిందో, భూగర్భ జలాలు ఎలా పెరిగాయో, సిరిసిల్ల పట్టణ రూపు రేఖలు ఎలా మారాయో చూసి నేర్చుకో. సిరిసిల్లలో ఆక్వా కల్చర్ కూడా మొదలవుతున్నది. అది కూడా చూసి నేర్చుకొని అమేథీలో కొన్నైనా అమలు చెయ్యి. మళ్లీ ప్రజల మనసులు గెలుచుకొనే ప్రయత్నం చెయ్యి’. అంతేగానీ వచ్చి అడ్డగోలుగా మాట్లాడి పోతానంటే కుదరదు.
ఎన్నార్డీపీని ఎందుకు ప్రశంసించరు?
హైదరాబాద్లో ఏదో ఒక పక్క చిన్న ప్రాంతం మునిగితే మొత్తం హైదరాబాదే మునిగిందని ప్రచారం చేస్తున్నారు. వంద కాలనీలను ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద అభివృద్ధి చేశాం. అక్కడ వరద ముప్పు తప్పింది. వారికి ఆ విషయం కనిపించడం లేదా? బయటి నుంచి వచ్చిన ఎంతోమంది హైదరాబాద్ అద్భుతంగా ఉన్నదని కితాబిచ్చారు. ఇక్కడున్నవారేమో అడ్డగోలుగా మాట్లాడుతారు. ఎస్ఎన్డీపీ కింద హైదరాబాద్లో రూ.వెయ్యికోట్లతో పనులు చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తాం.
సంక్షేమ పథకాలపై దుష్ప్రచారం
సంక్షేమ పథకాలు ఆర్థిక వ్యవస్థకు చేటు అని, శ్రీలంక లాంటి పరిస్థితి వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ధర్మమని ఆర్థిక శాస్త్రం చెప్తున్నది. నేలవిడిచి సాముచేసి, ఆకాశంలో మేడలు కట్టి.. స్పేస్ టెక్నాలజీ, రొబోటిక్స్, హైటెక్ అనే వాటినే చూసుకొని పేదవాడిని మరిచిపోతే ఆ రాష్ర్టానికి భవిష్యత్తు లేనట్టే. పేదవాళ్ల సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వమూ నిలదొక్కుకోలేదు.
ధరణి.. గొప్ప రెవల్యూషన్
ధరణిపై 11వ తేదీనే సీఎం నేతృత్వంలో సమావేశం ఉండేది. వరదల వల్ల వాయిదా పడింది. ధరణితో ప్రతీ సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది. కానీ కాస్త ఓపిక అవసరం. అన్ని గ్రామాల్లో 99% పూర్తయిపోయిందని సీఎంకు నివేదికలు ఇచ్చారు. ఇప్పుడు ధరణిలో రెండు రకాల సమస్యలే ఉన్నాయి. 1) ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు ఎక్కించే క్రమంలో ఏమైనా తప్పులు దొర్లితే దొర్లి ఉండొచ్చు. 2) ఆఫ్లైన్లో ఉన్న కొన్ని సేవలు ఆన్లైన్లో ఉండకపోవచ్చు. ఇవి తప్ప ఇంకేం ఇబ్బందులు లేవు. ధరణికి ముందు, తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూస్తే ప్రయోజనం అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయంతోపాటు.. పారదర్శకత పెరిగింది. అదనంగా రూపాయి కూడా చెల్లించకుండానే ఒకేరోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయిపోతున్నది. ఇదో గొప్ప రెవల్యూషన్. ఇవి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? ఎలుక వచ్చిందని ఇంటినే తగలబెట్టేస్తామా? చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని ధరణినే ఎత్తేస్తామా?
సీఎం రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
ప్రధాని అనధికారికంగా, ప్రైవేట్ కార్యక్రమం కోసం రాష్ట్ర పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం బ్లూ బుక్లో స్పష్టంగా ఉన్నది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ వస్తే రిసీవ్ చేసుకోలేదు. వాళ్లకో నీతి.. మాకో నీతా? మోదీ ఇటీవల మమ్ముల్ని తిట్టిపోవడానికే తెలంగాణకు వచ్చాడు. మోదీ గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రి అని నేను భావిస్తున్నా. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రూపాయి విలువ రూ.40-50 అయినప్పుడు అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అని మోదీ తిట్టిండు. ఇప్పుడు అవే పదాలు వాళ్లకు వర్తిస్తాయి కదా?