CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రతి ఔషధానికి కాలపరిమితి ఉన్నట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ఎక్స్పైరీ డేట్ ముగిసిందని, దేశంలో ఇకపై ఆ మందు పనిచేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం నాగ్పూర్లో నిర్వహించిన కాంగ్రెస్ 139వ ఆవిర్భావ సభలో రేవంత్ మాట్లాడారు.
మోదీ ఎప్పుడూ ‘చప్పన్ ఇంచ్ ఛాతీ’ అని గొప్పలు చెప్పుకుంటారని కానీ, లోక్సభలో ఓ సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సరార్ అంటే అదానీ, ప్రధాని తప్ప మరేం కాదని ఆరోపించారు. లోక్సభలో రాహుల్గాంధీ ఒక్కసారి ప్రశ్నించగానే అదానీ ఇంజిన్ ఆగిపోయిందని, రాహుల్గాంధీ చేపట్టే భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా పనిచేయడం మానేస్తుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.