ఖమ్మం, జనవరి 29 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): దేశంలో అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగి ఆర్థిక అరాచకం సృష్టిస్తున్న అదానీ వెనుక ప్రధాని మోదీ ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. అదానీ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ధనాన్ని అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టేలా మోదీ ప్రోత్సహించారని, అదానీని అరెస్ట్ చేసి విచారణ జరిపితే ఎన్నో కేసులు వెలుగులోకి వస్తాయని అన్నారు.
ఆదివారం ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానీ సంపాదన, ఆర్థిక ఎదుగుదల అంతా డొల్ల అని తేలిపోయిందని అన్నారు. అదానీ సంస్థలు ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డాయని, ప్రజలను నమ్మించి మోసం చేశాయని మండిపడ్డారు. ఒక్కరోజే నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర వివిధ సంస్థలు నష్టాన్ని చవిచూశాయని, అందులో ఎల్ఐసీ రూ.18 వేల కోట్ల మేర నష్టపోయిందని తెలిపారు. అదానీకి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు కట్టబెట్టారని, ఇప్పుడు ఈడీ, సీబీఐ ఇతర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.