హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ అనేకసార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా పలు ప్రధాన రహదారులు అభివృద్ధికి నోచుకోవడంలేదు. రాష్ర్టాల మధ్య అనుసంధానం, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జిల్లా ప్రధాన కార్యాలయాలను అనుసంధానం చేసే 14 అత్యంత ప్రాధాన్యం గల రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలశాఖ పలుమార్లు కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంవోఆర్టీహెచ్)కు విజ్ఞప్తిచేసింది. సుమారు 1,656.6 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారుల అభివృద్ధితో రాష్ట్రంలో రోడ్డు నెట్వర్క్ మరింత బలోపేతమై ప్రజారవాణాతోపాటు సరుకు రవాణా, రాష్ర్టాల మధ్య అనుసంధానం మరింత మెరుగవుతుందని ఆర్అండ్బీ పేర్కొన్నది. ప్రాధాన్యానికి అనుగుణంగా వీటిని జాతీయ రహదారులుగా ప్రకటించాలని కోరుతున్నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు.
ప్రతిపాదనలు ఏడేండ్లుగా పెండింగ్
చౌటుప్పల్-సంగారెడ్డి, కరీంనగర్-పిట్లం, వనపర్తి-పిట్లం, సారపాక-ఏటూరునాగారం తదితర రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించాలన్న ప్రతిపాదనలు 2015-16 నుంచి పెండింగులో ఉన్నాయంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఆర్అండ్బీశాఖ ఎప్పటికప్పుడు కేంద్ర రహదారులశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నా ఫలితం ఉండటం లేదని అధికారులు చెప్తున్నారు. కొన్ని రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటిస్తామని ప్రాథమికంగా ఒప్పుకున్నా అధికారికంగా నిర్ణయం వెల్లడించడం లేదని వాపోతున్నారు. తాజాగా ఆర్అండ్బీ శాఖ ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని మరోసారి జాతీయ రహదారుల శాఖకు విజ్ఞప్తిచేసింది. భూసేకరణ బాధ్యత తీసుకొనేందుకు ఆర్అండ్బీ శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం వెనకడుగు వేస్తుండటం గమనార్హం. కేంద్రం జాతీయ రహదారులుగా ప్రకటిస్తే వాటి నిర్మాణం, నిర్వహణ బాధ్యత కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వశాఖపై ఉంటుంది. నిధులు కూడా కేంద్రం నుంచే మంజూరవుతాయి.
1. చౌటుప్పల్ (ఎన్హెచ్-65)-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి (ఎన్హెచ్-65) – 182 కి.మీ.లు. -ఇది రీజనల్ రింగురోడ్డులో భాగంగా ఉన్నది. 2016 నుంచి పలు దఫాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
2. కరీంనగర్ (జంక్షన్ ఎన్హెచ్-563) – సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం (జంక్షన్ ఎన్హెచ్-161) – 165కి.మీ.- 2017 నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు.
3. వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం(ఎన్హెచ్-167)- 2017 నుంచి ప్రతిపాదనలు
4. ఎర్రవల్లి క్రాస్రోడ్ (ఎన్హెచ్-44) -గద్వాల్-రాయచూర్ (ఎన్హెచ్ -167) – 67 కి.మీ.- గద్వాల జిల్లా హెడ్క్వార్టర్ను జాతీయ రహదారికి కలిపే రోడ్డు.
5. మన్నెగూడ (ఎన్హెచ్-163) – వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్ (ఎన్హెచ్-50) – 133.9కి.మీ. – జిల్లా హెడ్ క్వార్టర్ను కలిపే రోడ్డు.
6. మరికల్ (ఎన్హెచ్-167) – నారాయణపేట్-రామసముద్ర (ఎన్హెచ్-150) – 63 కి.మీ. -నారాయణపేట్ జిల్లా హెడ్క్వార్టర్ను జాతీయ రహదారితో అనుసంధానం చేస్తున్న రోడ్డు.
7. జగిత్యాల (ఎన్హెచ్-563) – పెద్దపల్లి – కాల్వశ్రీరాంపూర్ – కిష్టంపేట – కల్వపల్లి -మోరంచపల్లి – రామప్ప ఆలయం- జంగాలపల్లి
(ఎన్హెచ్-163) – 164కి.మీ. – పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్తోపాటు రామప్ప ఆలయ పర్యాటక ప్రాంతాన్ని కలుపుతున్న రోడ్డు.
8. సారపాక (ఎన్హెచ్-30) – ఏటూరునాగారం (ఎన్హెచ్-163)- 93కి.మీ. – 2015 నుంచి పెండింగు. ప్రాథమికంగా అనుమతించినా పురోగతి లేదు.
9. పుల్లూరు (ఎన్హెచ్-44) -అలంపూర్ – జటప్రోలు – పెంట్లవెల్లి – కొల్లపూర్ -లింగాల్ – అచ్చంపేట – దిండి (ఎన్హెచ్-765) – దేవరకొండ (ఎన్హెచ్ -167) – మల్లేపల్లి (ఎన్హెచ్-167) -నల్లగొండ
(ఎన్హెచ్-565) – 225.1 కి.మీ. – వివిధ జిల్లాలతో అలంపూర్ ఆలయాన్ని అనుసంధానం చేస్తున్న రోడ్డు.
10. దుద్దెడ (ఎన్హెచ్-365బీ) -కొమరవెల్లి (ఎన్హెచ్-365) – యాదగిరిగుట్ట – రాయగిరి క్రాస్రోడ్ (ఎన్హెచ్-163) కొమరవెల్లి, యాదాద్రి ఆలయాలను కలిపే రహదారి.
11. జగ్గయ్యపేట (ఎన్హెచ్-65) -వైరా-కొత్తగూడెం (ఎన్హెచ్-30) – 100కి.మీ. – వ్యాపార, వాణిజ్య అవసరాల ప్రాధాన్యం గల అంతర్రాష్ట్ర కనెక్టివిటీ రోడ్డు.
12. సిరిసిల్ల (ఎన్హెచ్-365బీ) – వేములవాడ – కోరుట్ల (ఎన్హెచ్-63). 65కి.మీ. – వేములవాడ
ఆలయానికి కనెక్టివిటీ.
13. భూత్పూర్ (ఎన్హెచ్-44) -నాగర్కర్నూల్ – మన్ననూర్ – మద్దిమడుగు – గంగాలకుంట – సిరిగిరిపాడు (ఎన్హెచ్ -565ఏ.పీ) – 165.5కి.మీ. – ఆలయాన్ని అనుసంధానం చేసే రోడ్డు.
14. కరీంనగర్(ఎన్హెచ్-563) -రాయపట్నం (ఎన్హెచ్-63) – 60కి.మీ. – ఆర్థిక ప్రాధాన్యం గల రోడ్డు.