రక్షణరంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఇప్పుడు ఆ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నది. దేశ రక్షణలోనే అత్యంత కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల (ఓడీఎఫ్)ను ప్రైవేటీకరించేందుకు కుట్ర పన్నుతున్నది. తెలంగాణలోని అతిపెద్ద రక్షణ ఉత్పత్తి సంస్థల్లో ఒకటి, దేశంలోనే సాయుధ పోరాట వాహనాలను తయారుచేస్తున్న ఏకైక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అయిన ఎద్దుమైలారం ఓడీఎఫ్ను ఇప్పటికే ఆర్మ్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్లో విలీనం చేసింది. దీంతో ఫ్యాక్టరీకి మిలిటరీనుంచి ఆర్డర్లు కరువయ్యాయి. ఈ ఫ్యాక్టరీకి ముడిసరుకులు, కొత్త ఉద్యోగాల నియామకాలు నిలిపివేసి.. ఆ సాకుతో మూసివేతకు ప్రణాళిక రచించింది. కేంద్ర ప్రభుత్వ నిరర్ధక విధానాల ఫలితంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో 3,500 మంది ఉద్యోగుల భవిష్యత్తు ఆందోళనలో పడింది.
సంగారెడ్డి/కంది, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ పరిధిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్) ఉంది. 1984 జూలై 19న అప్పటి మెదక్ ఎంపీ ఇందిరాగాంధీ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమ గతంలో భారత ప్రభుత్వరంగ సంస్థగా ఉండేది. ఈ పరిశ్రమలో రక్షణ రంగ ఉత్పత్తులైన క్షిపణులు, ట్యాంకులు, మైన్ప్రూఫ్ వాహనాలు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలు తయారయ్యేవి. మిలిటరీ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్కు వరుసగా ఆర్డర్లు ఇచ్చేది. కాగా, మోదీ సర్కారు ఓడీఎఫ్ను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆర్మ్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్) పరిధిలోకి చేర్చింది. ఏవీఎన్ఎల్ పరిధిలోకి వచ్చాక ఫ్యాక్టరీకి మిలిటరీనుంచి ఆర్డర్లు తగ్గిపోయాయి. ఆర్డర్లు లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓవర్ డ్యూటీలు చేసే కార్మికులు ఇప్పుడు ఓడీ కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఆర్డర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఓపెన్ టెండర్లలో పాల్గొని ఆర్డర్లు తెచ్చుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నది.
ఓడీఎఫ్ భూములపై కేంద్రం కన్ను
ఓడీఎఫ్ భూములపైనా కేంద్ర సర్కారు కన్నుపడింది. ఇంద్రకరణ్, క్యాసారం, ఎద్దుమైలారం, సింగాపురం గ్రామానికి చెందిన రైతుల నుంచి 3,025 ఎకరాల భూమిని అప్పట్లో సేకరించారు. అప్పుడు రూ.4 వేలకు ఎకరం ఉన్న భూమి, ఇప్పుడు రూ.4 కోట్లకు చేరడంతో ప్రైవేట్పరం చేసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నదని మేధావులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఓడీఎఫ్ ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన దవాఖానను కూడా ప్రైవేట్పరం చేయడంతో సరైన వైద్యం అందడం లేదు. దవాఖానలో మందులు అందుబాటులో ఉంచడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. వర్క్ ఆర్డర్లు లేని కారణంగా త్వరలోనే ఓడీఎఫ్ ఖాయిలా పడే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే మోదీ ప్రభుత్వం ఓడీఎఫ్ను ప్రైవేటు వ్యాపారులైన అదానీ, అంబాలనీలకు అంటగడుతుందని, అప్పుడు తమ భవిష్యత్తు అంధకారమే అని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మోదీ హయాంలో ఓడీఎఫ్ పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన చెందుతున్నారు. ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వమే.. ఆర్డర్లకు అడ్డుపుల్లలేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉసురుతీయాలని చూస్తున్నదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఓడీఎఫ్ను ప్రైవేటుపరం చేస్తే 3,500 మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు బీపీఎంఎస్, ఏఐడీఈఎఫ్, ఏఐబీడీఈఎఫ్, సీడీఆర్ఏ, ఏకేటీయూఎస్లాంటి ఫెడరేషన్ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. అయితే, తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్ష లు విధించిందని కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నియంతృత్వ పోకడతో తమ నోరు నొక్కి, బతుకులను బుగ్గిపాలు చేసేందుకు చూస్తున్నదని మండిపడుతున్నారు.
బీడీఎల్ ప్రైవేటీకరణకూ యత్నం
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దేశంలో ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలను తయారుచేసే ప్రభుత్వరంగ సంస్థ. 1970లో దీన్ని హైదరాబాద్లో గైడెడ్ ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రంగా ప్రారంభించారు. భారతీయ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డీఆర్డీవో, అంతరిక్ష పరిశ్రమల నుంచి ఇంజినీర్లను సమీకరించి బీడీఎల్ను స్థాపించారు. అప్పటినుంచీ రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తూ దేశ రక్షణ రంగానికి దన్నుగా నిలుస్తున్న బీడీఎల్పైనా కేంద్రం కన్నుపడింది. దీన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర సర్కారు అడుగులు వేస్తున్నది. దీనిని వ్యతిరేకిస్తూ ఇటీవలే కార్మికులు ఆందోళన చేశారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నారు.
రక్షణ రంగాన్ని కాపాడాలి
దేశ రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించడం దారుణం. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వర్క్ ఆర్డర్స్ లేవని చెప్పడం నిజంగా దురదృష్టకరం. కోట్ల రూపాయల విలువ చేసే మిషన్లు, 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆర్డర్స్ తీసుకొస్తే పని చేసేందుకు సర్వం సిద్ధంగా ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, వారిని మానసింగా క్షోభకు గురిచేస్తున్నది. కేంద్రం తీసుకొన్న ఈ అనాలోచిత నిర్ణయం దేశానికే ముప్పు. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం. – కేవీ రమణారెడ్డి, ఆయుధ కర్మాగార ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు
రక్షణ సంస్థతో వ్యాపారం చేయొద్దు
దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల అవసరాలు తీర్చేందుకు ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని వ్యాపారంగా చూ డొద్దు. దేశ భద్రత సంస్థను కార్పొరేషన్గా మార్చాలనుకోవడం సరికాదు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఖర్చులు తగ్గించి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టాలి. కానీ, ఉన్నది మూసి వేయాలనుకోవడం అవివేకం.
– అజయ్, సీడీఈఆర్ఏ ప్రధాన కార్యదర్శి
కార్పొరేటీకరణ ఎత్తివేయాలి
కేంద్రం మొండి వైఖరిని వీడి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణను ఎత్తివేయాలి. జాతీయస్థాయి యూనియన్ నాయకులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తే డిఫెన్స్ సర్వీస్ యాక్టు తీసుకొచ్చి ఉద్యమించకుండా చేశారు.
– బుస్స ఈశ్వరయ్య, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు
ఉద్యోగుల నోట్లో మట్టిగొట్టే యత్నం
ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టాలనుకోవడం దుర్మార్గం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజాప్రతినిధిగా ఉద్యోగుల పక్షాన రాష్ట్రపతికి లేఖ రాశా. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఉన్న 3,050 ఎకరాల భూములపై కేంద్రం కన్నుపడింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మా అస్థిత్వం. ఆ భూములు మాకే సొంతం. ఉద్యోగాలు, ఉపాధి ఉంటుందని స్థానికులు వేల ఎకరాల భూమిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇచ్చారు. భూములు ఇచ్చిన కొందరికే ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 169 మంది భూ బాధితులకు ఇప్పటి వరకూ ఉద్యోగాలు రాలేదు. – మల్లారెడ్డి, సర్పంచ్ ఎద్దుమైలారం(సంగారెడ్డి జిల్లా)