హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల అడుగడుగునా వివక్షతో వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మరోసారి తన కక్షను ప్రదర్శించింది. జడ్చర్ల ఇండస్ట్రియల్ పార్కులో వ్యర్థజలాల శుద్ధి ప్లాంటు ఏర్పాటుకు నిధులిచ్చేందుకు నిరాకరించింది. ఈ నిధుల కోసం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) పంపిన ప్రతిపాదనను ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ (టీఐఈఎస్) ఎంపవర్డ్ కమిటీ తిరస్కరించింది.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో జడ్చర్లలో గ్రీన్ ఇండస్ట్రీస్ అండ్ ఫార్ములేషన్స్ పార్కును ఏర్పాటు చేశారు. ఔషధ కంపెనీలతోపాటు కాలుష్యానికి ఆస్కారంలేని కంపెనీల కోసం ఏర్పాటైన ఈ పార్కులో రోజుకు 1.5 మిలియన్ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధి చేయగలిగే కామన్ ఎఫులియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఖర్చయ్యే రూ.49.76 కోట్లలో టీఐఈఎస్ కింద రూ.20 కోట్లు మంజూరు చేసి, తొలి విడతగా వెంటనే రూ.10 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపారు. ఈ నెల 9న జరిగిన టీఐఈఎస్ ఎంపవర్డ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
సీఈటీపీలు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ల పరిధిలోకి రావని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు జడ్చర్ల మండలం పోలేపల్లిలోని 954.23 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను ప్రతిపాదించారు. ఇందులో స్పెషల్ ఎకనమిక్ జోన్కు 240 ఎకరాలు, ఫార్మా, హెటిరో డ్రగ్స్ కంపెనీల ఎస్ఈజెడ్లకు 75 ఎకరాల చొప్పున కేటాయించారు. 445.56 ఎకరాలను పారిశ్రామికవాడగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఎస్ఐఐసీ ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధిచేసింది. ఇందులో ఇప్పటికే పలు కంపెనీలకు స్థలాలను కూడా కేటాయించారు. ఈ పార్కులో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంటుకు నిధులిచ్చేందుకు కేంద్రం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా నిధులు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.