కవాడిగూడ, డిసెంబర్ 6: నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర బేవరేజస్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గజ్జెల నగేశ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.
మంగళవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బడుగుబలహీన వర్గాల అభివృద్ధితో పాటు విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితుల అభివృద్ధి కోసం దళితబంధు ప్రవేశపెట్టిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.