హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తూ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్న తీరుపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరుగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంట్లో సమగ్ర చర్చ జరుగాలన్నదే తమ అభిమతమని విస్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభల్లో వేర్వేరుగా జరిగిన బీఏసీ సమావేశాల్లో పార్టీమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు పాల్గొన్నారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ.. కేంద్రం మునుపెన్నడూ లేనివిధంగా రాజ్యాంగబద్ద సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని, దీనిపై సభలో సమగ్ర చర్చ జరుగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా కేంద్రం తన రాజకీయ ప్రయోజనాల కోణంలోనే సభను తప్పుదారి పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని, వీటిపై సమగ్రంగా చర్చించాలని తాము మొత్తుకుంటున్నా సభలో వాటి ప్రస్తావనే ఉండటం లేదని మండిపడ్డారు. బీఏసీ సమావేశాల్లో మాత్రం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమని చెప్తారని, తీరా సభలో అవకాశం కల్పించరని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. బీజేపీయేతర రాష్ర్టాలకు ఒకరీతిగా కేంద్రం వ్యవహరిస్తున్నదని, అవకాశం కల్పిస్తే ఆధారాలతో సహా తాము వెల్లడిస్తామని సవాల్ చేశారు. తాము కేవలం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే చర్చించాలని పట్టుబట్టడం లేదని, దేశ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తున్న వైనాన్ని చర్చించాలని కోరుతున్నామని స్పష్టంచేశారు. ఎన్నికలు ఉన్న రాష్ర్టాలకు ఒక రకంగా.. ఎన్నికలు లేని రాష్ర్టాలకు ఒక రకంగా కేంద్రం నిధులు, ప్యాకేజీలు విడుదల చేస్తున్నదని, వీటిపై సమగ్రంగా చర్చించాలని కోరారు.
తెలంగాణపై ఎందుకీ వివక్ష? : నామా నాగేశ్వర్రావు
తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరిపి, న్యాయం చేయాలని నామా నాగేశ్వర్రావు కోరారు. పార్లమెంట్ హాల్లో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న విభజన హామీలను సత్వరం అమలుచేసే విధంగా సభలో చర్చ జరుగాలని పట్టుబట్టారు. విభజన చట్టం హామీలను అమలుచేయడం లేదని, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా ఉద్దేశపూర్వకంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణపై కేంద్రానికి వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణాలు పొందే విషయంలో కూడా లేనిపోని ఆంక్షలు విధించి వివక్ష చూపుతున్నదని, దీనిపై కూడా చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. ధరల పెరుగుదల, రైతాంగం సమస్యలు, విద్యుత్తు సంసరణలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, నిరుద్యోగం, బీసీ కుల గణన, రిజర్వేషన్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. కేంద్రం మోకాలడ్డుతున్న కారణంగా రాష్ర్టానికి రూ.40 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని నామా వివరించారు.