హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరు చేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు. వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మోదీ సర్కారు రాష్ట్రంలో మంజూరు చేసి, నిర్మించిన రహదారుల్లో అత్యధికం తెలంగాణను కొద్దిదూరం టచ్ చేస్తూ వెళ్తున్నాయే తప్ప ఎక్కువ దూరం వెళ్తున్నవి తక్కువ. దక్షిణ భారతదేశంలో తెలంగాణ మధ్యలో ఉండటంతో చుట్టూ ఉన్న రాష్ర్టాలను కలిపేందుకు వేసే రోడ్లు తెలంగాణ మీదుగా పోవటం అనివార్యం. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించిన ఎన్హెచ్లలో అత్యధికం తెలంగాణ అంచుల నుంచే వెళ్లాయి తప్పితే.. మధ్య నుంచి వెళ్లలేదు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను ఎన్హెచ్లతో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన 14 రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏండ్లుగా విజ్ఞప్తిచేస్తున్నా కేంద్రం పట్టించుకొన్న పాపాన పోలేదు.
పారిశ్రామిక అవసరాలు పట్టని కేంద్రం
తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో కూడా అనేక కుటీర,చిన్నతరహా పరిశ్రమలు కొలువుదీరాయి. అక్కడి ఉత్పత్తులను మార్కెట్ చేసేందుకు జాతీయ రహదారులు ఎంతో అవసరం. వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రాడక్ట్ అనే విధానంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలవారీగా ప్రత్యేక ఫుడ్ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని జాతీయ రహదారులకు అనుసంధానం చేయటంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆర్అండ్బీ శాఖ పంపిన రోడ్ల జాబితాలో అనేక ప్రధాన మార్గాలు ఉన్నప్పటికీ మంజూరు చేయకుండా తాత్సారం చేస్తున్నది.