విజయవంతంగా నడుస్తున్న ఒక విద్యుత్తు పంపిణీ సంస్థ.. గత ఐదేండ్లలో రూ.1,000 కోట్ల వరకు లాభాలు ఆర్జించింది. ఏటా రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నది.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ రూ.20 వేలకోట్ల నుంచి రూ.25 వేల కోట్లు.. దానిని కేంద్రప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ప్రారంభ అమ్మకపు ధర రూ.175 కోట్లు.. అమ్మిన ధర రూ.871 కోట్లు. ఆ విద్యుత్తు సంస్థ పేరు చండీగఢ్ విద్యుత్తు పంపిణీ సంస్థ. కొన్న సంస్థ ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్. ఈ ఒక్క ఉదాహరణ చాలదా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో విద్యుత్తు రంగాన్ని ఏం చేయబోతున్నదో చెప్పడానికి..
హైదరాబాద్, ఫిబ్రవరి 27 : సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేయటంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కుతున్నది. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ఎంత తక్కువకు వీలైతే అంత తక్కువకు తన మిత్రులకు ధారపోసేందుకు ప్రయత్నిస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిస్కం)పథకం ప్రకారం ప్రైవేటీకరించే పన్నాగానికి కేంద్రం ఒడిగడుతున్నది. విద్యుత్తు చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందకముందే దొడ్డిదారిలో డిస్కంలను ప్రైవేటుపరం చేసే ప్రక్రియ వేగం పుంజుకొన్నది. ఈ ప్రక్రియకు ‘రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్’గా పేరుపెట్టినప్పటికీ విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదాలో పొందుపరిచిన దానినే ఇలా అమలు చేస్తున్నదని విద్యుత్తు రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు.
అప్పనంగా అప్పగింత
కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లును తెలంగాణ, పశ్చిమబెంగాల్తో పాటు 13 రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో కేంద్రం దీనిని అమలు చేయడానికి మొదట తన ఆధీనంలోని కేంద్ర పాలిత ప్రాంతాలను, బీజేపీ పాలిత రాష్ర్టాలను ఎంచుకొన్నది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో విద్యుత్తు విభాగం ప్రైవేటీకరణ కార్పొరేట్లకు కేంద్రం దోచిపెట్టే తీరుకు అద్దం పడుతున్నది. చండీగఢ్ డిస్కం ఆస్తుల విలువ రూ.25 వేల కోట్ల వరకు ఉంటుంది. దీనిని కేంద్రప్రభుత్వం రూ.871 కోట్లకే ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్కు ధారాదత్తం చేసింది. మరీ దారుణం ఏమిటంటే ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ సంస్థ అమ్మకానికి కేంద్రం ప్రారంభ ధర కేవలం రూ.175 కోట్లుగా నిర్ణయించింది. దీంతో చండీగఢ్ విద్యుత్తు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనవరి మొదటివారంలో ఒకరోజు సమ్మెచేసిన ఉద్యోగులు, తాజాగా సోమవారం నుంచి 72 గంటల నిరవధిక సమ్మె ప్రారంభించారు. వీరికి అక్కడి ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్రం మాత్రం ఈ నిరసనలను పట్టించుకోకుండా మార్చిలో చండీగఢ్ విద్యుత్తు పంపిణీ విభాగం మొత్తాన్ని ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టేందుకు వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నది.
మీటర్ల భారం వినియోగదారుడిపైనే
రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో విద్యుత్తు స్మార్ట్ మీటర్లు పెట్టడం తప్పనిసరి. మీటర్ల ఖర్చు భారం కూడా వినియోగదారుడే మోయాలి. ఈ భారాన్ని తాము కొంత పంచుకొంటామని కేంద్రం గతంలో చెప్పిన మాటల్లో ఏమాత్రం నిజం లేదని చండీగఢ్ ఎపిసోడ్తో తేలిపోయింది. స్మార్ట్ మీటర్ ధర రూ.3 వేలు ఉండగా, కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ.900 మాత్రమే. మిగతా రూ.2100 భరించాల్సింది వినియోగదారుడే. రైతులకు అందించే ఉచిత, సబ్సిడీలను కేంద్రం భరిస్తుందని చెప్తున్నా, అది ఎలా అన్నదానిపై స్పష్టత ఇవ్వటంలేదు. ఉచిత, సబ్సిడీ మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు సకాలంలో చెల్లించకపోతే విద్యుత్తు సరఫరాను నిలిపివేసే అధికారం వాటికి ఉంటుంది. గృహ వినియోగదారులు, పేదలు, రైతులకు ప్రస్తుతం ఉచితంగా, సబ్సిడీల రూపంలో అందిస్తున్న మొత్తాన్ని కోత పెట్టి, విద్యుత్తు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసే రాష్ర్టాలు మాత్రమే అప్పు పొందేలా విద్యుత్తు చట్ట సవరణ ముసాయిదా బిల్లులోనే ఉన్నదని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు.
సొమ్ము ప్రజలది.. సోకు ప్రైవేటు సంస్థలది
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ఏ రాష్ట్ర, యూటీ అయినా వందలు, వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి మౌలిక వసతులు ఏర్పాటుచేసుకొంటాయి. అదంతా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే సొమ్మే. రాష్ర్టాల్లో మారుమూల పల్లెలకు కూడా విద్యుత్తును సరఫరాచేసే నెట్వర్క్ను నిర్మించాయి. లాభదాయకం కాకపోయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా విస్తృతమైన విద్యుత్తు సరఫరా వ్యవస్థను నెలకొల్పుకొన్నాయి. ఇప్పుడు కేంద్ర నిర్వాకంతో ప్రైవేటు సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండా విద్యుత్తు వ్యాపారం చేసుకోబోతున్నాయి. ఇన్నాళ్లూ పేదలు, రైతులు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు సబ్సిడీతో విద్యుత్తును అందించేందుకు రాష్ర్టాలు చేసిన అప్పులు రాష్ర్టాలే కట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రైవేటు సంస్థలు మోయాల్సిన అవసరం ఉండదు. సబ్సిడీలు కూడా ఇవ్వాల్సిన పనిలేదు. విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు పూర్తిగా ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్తాయి. విద్యుత్తు చార్జీలను ఖరారు చేసే రెగ్యులేటరీ అథారిటీలు కూడా ప్రైవేటు సంస్థల పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో నెలనెలా ధరల సవరణకు కూడా ప్రైవేటు సంస్థలు వెనుకాడకపోవచ్చు.