హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయో తెలుసా.. ‘0’.. అవును.. ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కొవిడ్ టీకాల నిల్వలు అడుగంటిపోయాయి. టీకాలను సరఫరా చేయాలని రెండు వారాల కిందే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో కొవిడ్ నిల్వలు లేని దుస్థితి తలెత్తింది. మరోవైపు కేంద్రం మాత్రం దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతన్నాయంటూ రాష్ర్టాలకు వరుసగా లేఖలు రాస్తున్నది. ఉన్నతస్థాయి సమీక్షల పేరుతో హడావుడి చేస్తున్నది. అప్రమత్తంగా ఉండాలని, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేస్తున్నది. ఇప్పటికిప్పుడు కనీసం 20 లక్షల వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరితే మాత్రం వివక్ష చూపుతున్నది.
7.75 కోట్ల డోసుల పంపిణీ.. ఇంకా 1.72 కోట్లు అవసరం
రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి మొదటి డోసు, 3.15 కోట్ల మందికి రెండో డోసు ఇచ్చారు. మరో 1.35 కోట్ల ప్రికాషన్ డోసు వేశారు. మొత్తంగా ఇప్పటివరకు 7.75 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. మొదటి, రెండో డోసులను వేగంగా పంపిణీ చేసి తెలంగాణ రోల్ మాడల్గా నిలిచింది. ప్రికాషనరీ డోసులనూ వేగంగా పంపిణీ చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తరచూ బ్రేకులు వేస్తూనే ఉన్నది. కొన్ని నెలలుగా కేంద్రం నుంచి వ్యాక్సిన్లు సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో కోల్డ్ చెయిన్ పాయింట్స్లో వ్యాక్సిన్లు నిండుకున్నాయి. ఫలితంగా టీకాల పంపిణీ దాదాపు నిలిచిపోయింది. రాష్ర్టానికి ఇంకా సుమారు 1.71 కోట్ల డోసుల టీకాలు అవసరమవుతాయని అంచనా. మొదటి డోసు ఇంకో 2500 మంది వరకు వేయాల్సి ఉంటుంది. రెండో డోసు 8.87 లక్షలు అవసరం, ప్రికాషన్ డోసు 1.63 కోట్లుగా ఉన్నది.
కేంద్రం.. గందరగోళం
దేశంలో కొన్ని వారాలుగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి 24 గంటల్లో 3,824 కేసులు నమోదయ్యాయి. గత 6 నెలల్లో ఇదే అత్యధికం. దీంతో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తరచూ సమీక్షలు జరుపుతున్నది. రాష్ర్టాల కొవిడ్పై దృష్టిసారించాలని, ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించాలని.. ఇలా రాష్ర్టాలకు తరచూ సూచనలు జారీ చేస్తున్నది. పైగా వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని, అర్హులందరికీ టీకా ఇవ్వాలని చెప్తున్నది. రెండు రోజుల కిందటే మరో లేఖ రాసింది. మరోవైపు ఎంత విన్నవించినా వ్యాక్సిన్లను మాత్రం పంపిణీ చేయడం లేదు. వ్యాక్సిన్లు లేకుండా వ్యాక్సినేషన్ వేగాన్ని ఎలా పెంచుతామని రాష్ర్టాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా అవసరమైన వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
మంత్రి లేఖ రాసినా..
పరిస్థితిని ముందుగానే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని అలర్ట్ చేసింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై మంత్రి హరీశ్రావు గత నెల 17న వైద్యాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ టెస్టులు పెంచడంతో పాటు అర్హులైన ప్రతి ఒకరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేవలం 6వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన వెంటనే స్పందించి, వ్యాక్సిన్లు సరఫరా కోసం కేంద్రానికి ఇండెంట్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు మంత్రి హరీశ్రావు స్వయంగా అదే రోజు (మార్చి 17న) రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని మీకు తెలిసిందే. వ్యాక్సినేషన్లో తెలంగాణ మొదటి నుంచీ ముందువరుసలో ఉన్నది. రెండు డోసుల పంపిణీ 102శాతం పూర్తి కాగా, ప్రికాషన్ డోసు దేశంలోనే అత్యధికంగా 48.79 శాతం పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 6 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు తక్షణం 20 లక్షల డోసులు అవసరం. దయచేసి వెంటనే సరఫరా చేయగలరు’.. అని ఆ లేఖలో మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖను, ప్రభుత్వ వినతిని కేంద్రం పెడచెవిన బెట్టింది. రెండు వారాలు గడిచినా ఒక వ్యాక్సిన్ డోసును సరఫరా చేయలేదు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఒక డోసు టీకా లేకుండా పోయింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ నిలిచిపోయింది.
టీకాలు రాగానే వ్యాక్సినేషన్
కేంద్రం నుంచి రాష్ర్టానికి టీకాల సరఫరా నిలిచిపోయింది. కనీసం 20 లక్షల డోసులు కావాలని ఇండెంట్ పెట్టాం. స్పందన రాలేదు. రాష్ట్రంలో నిల్వ ఉన్న డోసులన్నింటినీ ప్రజలకు పంపిణీ చేశాం. ఇప్పుడు టీకాలు లేవు. వ్యాక్సినేషన్ నిలిపివేశాం. కేంద్రం ఎప్పుడు టీకాలు పంపిస్తే అప్పుడే మళ్లీ వ్యాక్సినేషన్ మొదలుపెడతాం.
– గడల శ్రీనివాసరావు, డీపీహెచ్