కోట్లాది కూలీల ఉపాధికి గ్యారంటీ ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో పన్నాగం పన్నింది. ఇప్పటివరకు కేంద్రం కేటాయిస్తున్న పనులను వెంట వెంటనే పూర్తి చేసుకొంటూ.. అనేక మౌలిక సదుపాయాల కల్పనలో ముందున్న రాష్ర్టాలకు కేంద్రం నిర్ణయం శరాఘాతంగా మారబోతున్నది. ఇప్పటికే అనేక రకాల నిబంధనలు, షరతులు, తప్పుడు నివేదికలతో కూలీల పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏకకాలంలో చేపట్టాల్సిన పనుల సంఖ్యను కూడా నిర్దేశించి.. కూలీల పనిదినాలపైనా.. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపైనా ప్రభావం చూపుతున్నది.
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకానికి సమాధి కట్టే దిశగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నాలు మొదలు పెట్టిందా? మోదీ సర్కారు ఈ పథకంలో తీసుకొచ్చిన తాజా నిబంధనలు గమనిస్తే అవుననే అభిప్రాయాలే వ్యక్తమ వుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఒక గ్రామంలో ఏకకాలంలో 20 పనులకు మించి చేపట్టరాదు. గ్రామానికి 20 పనులు మాత్రమే కొనసాగించాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ నిబంధన ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని కూడా పేర్కొన్నది. ఆ 20 పనుల్లో ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాతే.. కొత్త పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకసారికి 20 పనులకు మాత్ర మే బిల్లులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఇతర పనుల బిల్లులను నరేగా సాఫ్ట్వేర్ ఇకపై అనుమతించదు. ఈ కారణంగా చాలా గ్రామాల్లో కొన్ని నెలల పాటు కొత్త పనులు ప్రారంభించే అవకాశమే ఉండదు. ఇది మొత్తంగా ఉపాధి హామీచట్టం స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా మారే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉపాధిహామీ పనులు లేక ఊళ్లకు ఊళ్లు తాళాలు వేసుకొని ఇతర రాష్ర్టాలకు వలసలు పోయిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
బీజేపీ సర్కారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ నిబంధన ఆగస్టు 20 నుంచి అమలులోకి వస్తుందని కూడా పేర్కొన్నది. ఆ 20 పనుల్లో ఏదైనా ఒక పని పూర్తయిన తర్వాతే.. కొత్త పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకసారికి 20 పనులకు మాత్రమే బిల్లులు చేసే వెసులుబాటు ఉంటుంది. ఇతర పనుల బిల్లులను నరేగా సాఫ్ట్వేర్ ఇకపై అనుమతించదు. ఈ కారణంగా చాలా గ్రామాల్లో కొన్ని నెలల పాటు కొత్త పనులు ప్రారంభించే అవకాశమే ఉండదు. ఇప్పుడు తెలంగాణలో ఒక్కో గ్రామంలో సగటున 38 పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా ఏకకాలంలో దాదాపు 5.82 లక్షల పనులు జరుగుతున్నాయి. వాటిలో 96,710 పనులు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. సుమారు 1.50 లక్షల మంది కూలీలు నరేగా ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఆయా పనులను బట్టి.. కొన్ని పనులు కొందరు మాత్రమే చేయగలరు. ఇప్పుడు 20 పనులు మాత్రమే చేయాలన్న కేంద్రం నిబంధనతో సహజంగానే కూలీలకు పనులు తగ్గిపోతాయి. ఏక కాలంలో జరుగుతున్న 38 పనుల్లో దాదాపు సగం నిలిచిపోతే.. చాలామంది కూలీలకు అసలు ఉపాధే లభించదు. తాము చేయగలిగిన పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని వేచిచూడాల్సి వస్తుంది. ఇప్పుడు గ్రామానికి నలువైపునా ఉపాధి కూలీలు రకరకాల పనులు చేస్తున్నారు. కొందరు కూలీలు అన్ని రకాల పనులు చేయలేరు. కొన్ని పనులు మాత్రమే చేయగలవాళ్లు కొందరుంటారు. మరోపక్క అన్ని రకాల పనులు చేయగలిగేవారు.. కేంద్రం విధించిన నిబంధనతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. కూలీలందరూ ఒక్క చోటే చేయాల్సి ఉంటుంది. ఒక పనికి ఒక పరిమిత సంఖ్యలో కూలీల అవసరం ఉంటుంది. ఈ నిబంధనతో అదనపు కూలీలకు పని దొరకకపోవచ్చు.
నిర్వీర్యానికి కుట్ర
నరేగా స్కీంను క్రమంగా బలహీనపరచడానికి కేంద్రం మొదట్నుంచీ ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నరేగాకు రూ.25 వేల కోట్ల నిధుల కేటాయింపులను బడ్జెట్లోనే కోత పెట్టింది. ఈ కోతకు అనుగుణంగా ఒక్కో నిబంధన, షరతులను వేర్వేరుగా విధిస్తున్నది. నేరుగా ఉపాధి హామీని బంద్ పెడితే ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో.. రకరకాల కొర్రీలు విధిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ అవసరమే లేదనే విధంగా కేంద్రం కుట్రలు పన్నుతున్నదని నిపుణులు అంటున్నారు.