(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాలు నిర్వహిస్తున్న టీవీ చానళ్ల ప్రసారాలను శాటిలైట్కు అప్లింకింగ్ చేసే ఎర్త్ స్టేషన్ను హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలించాలని కేంద్రంలోని మోదీ సర్కారు యత్నిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లో నడుస్తున్న టీ-శాట్ కేంద్రం నుంచి ఎర్త్ స్టేషన్ను గుజరాత్కు తరలించాలని కేంద్ర సమాచార శాఖ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఇటీవల దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది.
గుజరాత్లో ఉత్తరాది టీవీ చానళ్ల అప్లింకింగ్ చేసే ఎర్త్ స్టేషన్ను ఆధునిక వసతులతో తీర్చిదిద్దామని, దక్షిణాది రాష్ర్టాల ప్రభుత్వ చానళ్ల అప్లింకింగ్ చేసే ఎర్త్ స్టేషన్ను కూడా గుజరాత్కు మార్చాలని సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు. ఎర్త్ స్టేషన్ తరలింపుపై ఇంకా అంతిమ నిర్ణయం జరుగకపోయినా… ఒకవేళ, ఎర్త్స్టేషన్ తరలిపోతే, తెలంగాణ ప్రభుత్వం టీ-శాట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య- నిపుణ చానళ్ల కార్యక్రమాలు కొంత మందికే పరిమితమయ్యే ప్రమాదముందని రాష్ట్ర ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఎర్త్స్టేషన్ నుంచి అప్లింకింగ్ వ్యవస్థ ఉంటే వీక్షకుల సంఖ్య తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడే ఎర్త్ స్టేషన్ ఉండటంతో విద్య, నిపుణ చానళ్ల కార్యక్రమాలను కేబుల్ వ్యవస్థ ద్వారా కూడా ప్రసారం చేస్తున్నారు. గుజరాత్కు తరలిస్తే ఆ అవకాశం కోల్పోయే ప్రమాదముంది. అయితే ఈ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చితే ఆధునిక యంత్రాలతో కూడిన ఇక్కడి ఎర్త్ స్టేషన్ నిరుపయోగంగా మిగిలిపోతుందని, దాని వల్ల భారీగా ప్రజాధనం నష్టమౌతుందని రాష్ట్ర అధికారులు కేంద్రానికి వివరించినట్లు తెలిసింది.
కేంద్రం నియంత్రణలు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న సొంత మీడియా సంస్థలను నియంత్రించాలని కేంద్రం కుట్రపూరిత చర్యలకు ఉపక్రమించింది. తనకున్న అధికారాలను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై ఎలాంటి సొంత చానళ్లను ప్రారంభించరాదని ఆదేశించింది. ఇప్పటికే ప్రారంభించిన వివిధ చానళ్లను మూసి వేయాలని పేర్కొన్నది. దానికి వచ్చే ఏడాది (2023) డిసెంబర్ 31 గడువు పెట్టింది. ప్రసారమాధ్యమాల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, ఎలాంటి మీడియా సంస్థ ఏర్పాటు చేయాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ర్టాలు ఇకపై ఎలాంటి మీడియా సంస్థలు నడుపరాదని, కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రసార భారతి (దూరదర్శన్) సంస్థతో ఒప్పందం చేసుకోవాలని సూచించింది.
తెలంగాణసహా పలు రాష్ర్టాలపై కుట్ర
తెలంగాణ ప్రభుత్వం టీ శాట్ ద్వారా విద్య, నిపుణ చానళ్లు నడుపుతున్నది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు, నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండటంతో ప్రజాదరణ పొందాయి. టీ-శాట్కు యూట్యూబ్లో ఏడు లక్షల సబ్స్ర్కైబర్లు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాల వల్ల టీశాట్ చానళ్లతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోని చానళ్లు ప్రభావితమవుతాయని, అవి మూతపడతాయేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేశంలోని టీవీ చానళ్లన్నీ ఇక నుంచి ప్రతి రోజూ 30 నిమిషాల పాటు విధిగా జాతీయ ప్రాముఖ్యమున్న కంటెంట్ను ప్రసారం చేయాలంటూ ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే జాతీయ ప్రాముఖ్యమున్న కంటెంట్ పేరిట కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం కల్పించే కంటెంట్ను ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
తరలిస్తే నష్టమే
హైదరాబాద్ నుంచి ఎర్త్ స్టేషన్ను గుజరాత్కు తరలించాలన్న ప్రతిపాదన నిజమే. అయితే దీనిపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.టీ రామారావు చొరవతో ఇప్పటికే టీ-శాట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్త్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరికరాలతో, వివిధ హంగులతో ఏర్పాటు చేశాం. గుజరాత్కు ఎర్త్ స్టేషన్ను తరలిస్తే విలువైన సాంకేతిక వ్యవస్థ నిరుపయోగంగా మారుతుంది. విద్య, నిపుణ చానళ్లు ఇపుడు ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాయి. గుజరాత్కు తరలిస్తే మన చానళ్ల ప్రజాదరణ తగ్గిపోతుంది.
– టీ-శాట్ సీఈఓ ఆర్ శైలేష్ రెడ్డి